ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేసే హైడ్రోజన్ రైలు

national |  Suryaa Desk  | Published : Mon, Dec 15, 2025, 08:59 PM

వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు, పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్థ వైపు దృష్టి సారిస్తూ భారతీయ రైల్వేలు చారిత్రక నిర్ణయం తీసుకున్నాయి. భారతీయ రైల్వేలు తమ మొట్టమొదటి హైడ్రోజన్ శక్తితో నడిచే రైలును ప్రవేశ పెట్టేందుకు సిద్ధం అవుతున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అయితే ఈ చర్య 2030 నాటికి నికర-సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని సాధించడంలో ప్రధాన మార్పుకు నాంది పలకనుందని చెప్పారు.


అసలీ హైడ్రోజన్ రైలు ఎలా పని చేస్తుంది?


ఈ కొత్త హైడ్రోజన్ రైలులో మొత్తంగా 10 కోచ్‌లు ఉంటాయి. దీని సామర్థ్యం 2400 kW కాగా.. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైలు అవుతుందని మంత్రి ప్రకటించారు. అయితే ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్‌తో నడుస్తుంది. ఇవి హైడ్రోజన్‌ను ఆక్సిజన్‌తో కలిపి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంటాయి. ఇందుకోసం నీళ్లను మాత్రమే ఉపయోగిస్తుండగా.. ఈ ప్రక్రియలో శక్తి విడుదల అవుతుంది. ఈ శక్తి కూడా నీటి ఆవిరి రూపంలో బయటకు వస్తుంటుంది. డీజిల్ ఇంజిన్‌ల మాదిరిగా కాకుండా హైడ్రోజన్ రైళ్లు కర్బన్ డయాక్సైడ్ లేదా కాలుష్య కణాలను విడుదల చేయవు. కేవలం నీటిని మాత్రమే విడుదల చేస్తుంటాయి.


ఐరోపాలో ప్రస్తుతం కొన్ని తేలికపాటి హైడ్రోజన్ రైళ్లు నడుస్తున్నాయి. అయితే ఇందుకు భిన్నంగా.. భారత రైల్వే హైడ్రోజన్ రైళ్లు.. పూర్తి నిడివి గల ప్రయాణీకుల కోచ్‌లను లాగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. భారత్ దీర్ఘకాలిక లక్ష్యం పూర్తి విద్యుదీకరణే అయినప్పటికీ.. కొండ, మారుమూల, తీర ప్రాంతాలు వంటి కొన్ని నాన్-ఎలక్ట్రిఫైడ్ మార్గాలలో విద్యుదీకర చేపట్టడం చాలా ఖరీదుతో కూడుకుంది. అందుకే డీజిల్ రైళ్లకు స్వస్తి పలుకుతూనే.. విద్యుదీకరణ లేకుండానే నడిచే రైళ్లపై భారత్ దృష్టి పెట్టింది. ముఖ్యంగా వీటికి ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్ రైళ్లను ఉపయోగించాలని నిర్ణయించింది.


అయితే హైడ్రోజన్ రైళ్లు ప్రపంచ వ్యాప్తంగా విజయవంతంగా పని చేస్తున్నప్పటికీ.. మన దేశానికి మాత్రం వీటిపై కొన్ని సవాళ్లు ఉన్నాయి. పునరుత్పాదక శక్తిని ఉపయోగించి తయారుచేసే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చాలా ఖరీదైంది. అలాగే రైలు మార్గాల్లో హైడ్రోజన్ నిల్వ, ఇంధనం నింపే, భద్రతా మౌలిక సదుపాయాలను నిర్మించడం పెద్ద సవాలుతో కూడుకుంది. కానీ వీటన్నింటినీ దాటుకుని.. విశాలమైన నెట్‌వర్క్, అధిక ప్రయాణీకుల లోడ్, వేడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైళ్లను రూపొందించాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయోగం విజయవంతం అయితే.. భారీ-డ్యూటీ కార్యకలాపాలకు హైడ్రోజన్ రైలు సాంకేతికతను స్వీకరించిన అతికొద్ది దేశాలలో భారతదేశం ఒకటిగా నిలుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa