ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి దర్శనం మరింత వేగంగా.... టీటీడీ ఛైర్మన్ వెల్లడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 05, 2025, 07:40 PM

తిరుమల శ్రీవారి దర్శనం కోసం కొండకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే సాంకేతికత సాయంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే ఆలోచనలు చేస్తోంది. అందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో శ్రీవారి భక్తులకు రెండు గంటల్లోగా దర్శనం కల్పించే ఆలోచనను టీటీడీ గతంలో చేసింది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటంతో పాటుగా కొంతమంది నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఏఐ సాయంతో రెండు గంటల్లో శ్రీవారి దర్శనం గురించి విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రక్రియపై కాస్త వెనుకడుగు వేసిన టీటీడీ .. మరోసారి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే ఆలోచన చేస్తోంది. ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి అయిన నేపథ్యంలో హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు.. పలు కీలక విషయాలు వెల్లడించారు.


ఈ క్రమంలోనే ఏఐ సాయంతో తిరుమల శ్రీవారి దర్శనం గురించి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ ద్వారా రెండు గంటల్లో శ్రీవారి దర్శనం కల్పించాలనే ఆలోచన గతంలో చేసినట్లు బీఆర్ నాయుడు వివరించారు. అయితే ఓ వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమైందన్నారు. టీటీడీ నూతన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆధ్వర్యంలో త్వరలోనే ఈ ఏఐ ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. తాము బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుమల అన్నప్రసాదాల్లో మార్పులు వచ్చాయని బీఆర్ నాయుడు చెప్పుకొచ్చారు.


భక్తులకు రుచికరమైన భోజనం అందిస్తున్నామని.. లడ్డూ ప్రసాదంలోనూ చాలా మార్పులు చేశామన్నారు. ప్రస్తుతం లడ్డూ ప్రసాదాలు 10 రోజులైనా నిల్వ ఉంటున్నాయని భక్తుల నుంచ్ స్పందన వస్తోందన్నారు. తిరుపతివాసులు మూడు వేల మందికి ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తున్నామని వివరించారు. తిరుమల కాటేజీలకు దేవుడి పేర్లు పెట్టాలని నిర్ణయించామని.. టీటీడీలోని అన్యమతస్తులను కూడా కొంతమందిని ఉద్యోగాల నుంచి తొలగించామన్నారు. తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనాల విషయంలోనూ మార్పులు చేశామని బీఆర్ నాయుడు వివరించారు. ఉదయం పదిన్నరకు ఉండే బ్రేక్ దర్శనాలను తెల్లవారుజాముకు మార్చామన్నారు. శ్రీవాణ ట్రస్టు కింద 5 వేల ఆలయాల నిర్మాణం, ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో గుడులు, భజన మందిరాలు నిర్మించనున్నట్లు తెలిపారు.


మరోవైపు తిరుమల తరహాలో టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాల్లో నిత్యాన్నదానం అమలు చేయనున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వివరించారు. తిరుపతి తిరుమల మధ్యన ఎలక్ట్రికల్ బస్సులు నడుపుతామని టీటీడీ ఛైర్మన్ చెప్పుకొచ్చారు. కేంద్ర మంత్రి కుమారస్వామి టీటీడీకి 100 ఎలక్ట్రిక్ బస్సులు ఇస్తామన్నారని.. వాటిని తిరుపతి, తిరుమల మధ్య నడపనున్నట్లు తెలిపారు. దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయం నిర్మిస్తామన్న టీటీడీ ఛైర్మన్.. కరీంనగర్‌లో రూ.30 కోట్లతో , దుబ్బాకలో రూ.4.5 కోట్లతో శ్రీవారి ఆలయాలు నిర్మించనున్నట్లు వెల్లడించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa