ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండు రోజులు పొడిగింపు.. అప్రమత్తం కాకుంటే నష్టపోతారు.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 05, 2025, 07:46 PM

ఆంధ్రప్రదేశ్ రైతులకు ముఖ్య గమనిక. మొంథా తుఫాను కారణంగా రాష్ట్రంలో భారీగా పంట నష్టం సంభవించిన సంగతి తెలిసిందే. ఎంత మేరకు పంట నష్టం జరిగిందనే దానిపై అధికారులు లెక్కలు తీస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పంట నష్టం వివరాలను నమోదు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో పంట నష్టం వివరాల వెల్లడికి మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు మొంథా తుపాను పంట నష్టం నమోదు గడువును ఏపీ ప్రభుత్వం పొడిగించింది. ఈ గడువు మరో రెండు రోజులు పొడిగించినట్లు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ మేరకు అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఇంచార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి అచ్చెన్నాయుడు.


ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిపై, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యలపై చర్చించారు. పెండింగ్‌లో ఉన్న పనులు, శాఖల వారీగా పురోగతిపై సమీక్షించారు. ప్రజా సమస్యలు, జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఈ-క్రాప్‌ నమోదు వందశాతం పూర్తి జరిగిందని స్పష్టం చేశారు.


మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని.. ప్రతి రైతుకూ పరిహారం అందిస్తామని వెల్లడించారు. ఈ-క్రాప్‌ నమోదు చేయలేదని వైఎస్ జగన్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మంత్రి మండిపడ్డారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్‌కు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. వైఎస్ జగన్ తనకు నచ్చిన ప్రాంతానికి రావాలని.. తానూ వస్తానన్నారు. ఈ-క్రాప్‌ నమోదు అయిందో లేదో అక్కడే చూపిస్తానని మంత్రి అచ్చెన్నాయుడు ఛాలెంజ్ చేశారు.


 మరోవైపు మొంథా తుఫాన్ కారణంగా ఏపీ రైతులకు భారీగా నష్టం జరిగింది. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలకు పొలాల్లోని పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొంథా తుఫాను ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలో అపార పంట నష్టం సంభవించింది. తుఫాను నష్టం మీద ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. సుమారుగా 5 వేల కోట్ల నష్టం జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. కేంద్ర బృందాలను రాష్ట్రానికి పంపించాలని.. కేంద్ర బృందాల ద్వారా నష్టం పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఇప్పటికే కోరింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa