ఓట్ల చోరీ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓట్ల చోరీకి పాల్పడేవారిని కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఈసీ ఖూనీ చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత ఆరోపించారు. మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గతేడాది జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓట్ల చోరీ జరిగిందని ‘హైడ్రోజన్ బాంబు’ పేల్చారు. బీజేపీ నేతలు అనేక వ్యవస్థలను ఉపయోగించి 25 లక్షల ఓట్లను చోరీచేశారని ఆరోపణలు చేశారు. పోలైన మొత్తం ఓట్లలో దాదాపు 12.5 శాతం నకిలీవేనని రాహుల్ వెల్లడించారు.
హర్యానా ఎన్నికల్లో బ్రెజిల్కు చెందిన ఓ మోడల్ పేరుతో కూడా 22 ఓట్లు ఉన్నాయని రాయబరేలీ ఎంపీ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆమె ఒక్క ఫొటోతో సీమా, స్వీటీ, సరస్వతి వంటి పలు పేర్లు, వయసులు, జెండర్లతో 22 ఓట్లను సృష్టించారని ధ్వజమెత్తారు. హర్యానాలో 5 లక్షలకుపైగా నకిలీ ఓటర్లు ఉన్నారని, ప్రతి 8 ఓట్లలో ఒకటి నకిలీదని ఆరోపించారు. నకిలీ ఫొటోలతో లక్షకు పైగా ఓట్లు, ఒకే ఫొటోతో 2 బూత్లలో 223 ఓట్లు ఉన్నాయని వివరించారు. 93 వేలకుపైగా ఓట్లు తప్పుడు అడ్రస్లతో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఎన్నికల సమయంలో కొందరు కావాలనే ఓటర్లను చేర్చుతున్నారని పేర్కొన్నారు. దీంతోనే కాంగ్రెస్ గెలుస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ హర్యానాలో తాము ఓడిపోయామని అన్నారు.
ఎన్నికల సమయంలో ఇన్ని అక్రమాలు జరుగుతుంటే కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేసిందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. నకిలీ ఓటర్లను గుర్తించేందుకు ఎన్నికల కమిషన్ వద్ద సాఫ్ట్వేర్ కూడా ఉన్నప్పటికీ.. 5 లక్షలకు పైగా నకిలీ ఓటర్లు ఎలా వచ్చారని నిలదీశారు. ఈసీ తలచుకుంటే సెకెన్లలోనే నకిలీ ఓట్లను తొలగించేదని.. బీజేపీకి లబ్ది చేకూర్చేందుకునే అధికారులు చూసీచూడనట్టు వదిలేశారని ఆరోపించారు.
ఉత్తర్ ప్రదేశ్లో ఓటు వేసిన వేలాదిమంది హర్యానాలోనూ ఓటు వేశారని అన్నారు. బీజేపీ నాయకులు అడ్రస్లతో వందల సంఖ్యలో నకిలీ ఓట్లు ఉన్నాయని ధ్వజమెత్తారు. బీజేపీ వాళ్లనయినంత మాత్రాన దేశంలో ఎక్కడైనా ఓటు వేస్తారా? అని కాంగ్రెస్ అగ్రనేత ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలకు ముందు బీజేపీ నేత, హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ మీడియా సమావేశంలో మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు. ‘అన్ని ఏర్పాట్లూ జరిగిపోయాయి.. బీజేపీ విజయం సాధిస్తుంది’ అని ఆయన చెప్పడం వీడియోలో రికార్డయ్యింది. ‘ఏంటా ఏర్పాట్లు? పోలింగ్ జరిగిన రెండు రోజుల తర్వాత ప్రతి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో విజయం సాధిస్తుందని చెప్పారు... ఈ పెద్దమనిషి చాలా ఖచ్చితంగా, నవ్వుతూ, బీజేపీ ఏర్పాట్లు చేసిందని చెబుతున్నాడు.’ అని రాహుల్ గాంధీ విమర్శించారు. హర్యానా చరిత్రలోనే తొలిసారి పోస్టల్ బ్యాలెట్ ఫలితాలకు విరుద్దంగా పోలింగ్ బూత్లలో ఫలితాలు వచ్చాయని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa