శివకేశవులకు ఎంతో ప్రతీకరమైనది కార్తీక మాసం. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి ఎంత పవిత్రమైందో మనకు తెలుసు... ఆధ్యాత్మికంగా, దీప కాంతులతో, నదీ స్నానాలతో కళకళలాడే ఈ రోజు దెయ్యాలకు కూడా స్పెషలే... అదేంటి అంటారా.... నేపాల్లో వేలాది మందితో " భూత మేళా " అనే ఉత్సవం జరుగుతోంది! ధనుష, సిరాహా జిల్లాల సరిహద్దుల్లో ఉండే పవిత్రమైన కమలా నది ఒడ్డున తెల్లవారుజాము నుంచే భక్తులు కిటకిటలాడుతున్నారు. అసలు ఈ మేళా పేరు 'భూత మేళా' అని ఎందుకు పెట్టారు.. దీని ప్రత్యేకత ఏంటి అంటే... స్థానిక నమ్మకాల ప్రకారం, కార్తీక శుక్ల పౌర్ణమి రోజున కమలా నదిలో పవిత్ర స్నానం చేస్తే దుష్ట శక్తులు దూరమవుతాయట, దేవతలు సంతోషిస్తారట, మన జీవితంలో ఉన్న కష్టాలు, సమస్యలు కూడా తీరిపోతాయట! అందుకే, ఈ రోజున శక్తులు ఉన్నారని నమ్మే శమన్లు (పూజారులు), మాంత్రికులు తమ పూర్వీకుల ఆత్మలను, దేవతలను గౌరవిస్తూ ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు.
ధనుషకు చెందిన ఒక పూజారి ఏమన్నారంటే... "ఈ రోజున కమలా నదిలో స్నానం చేస్తే శరీరం శుద్ధి అవుతుంది. సాధువులు, శమన్లు (సిద్దులు) అందరూ ఈ రోజు ఇక్కడ స్నానం చేస్తారు కాబట్టి, నది మరింత పవిత్రమవుతుంది. జీవితంలో చేసిన పాపాలన్నీ కడిగేసుకోవడానికి ఈ రోజు ఉత్తమం అని చెప్పారు. ఈ శమన్లు, ధార్మిక పూజారులు డ్రమ్స్, తాళాలు, 'మదల్' వాయిద్యాల శబ్దానికి అనుగుణంగా తమ శరీరాలను కదుపుతూ, తలలను తిప్పుతూ పూజలు చేయడం ఇక్కడ హైలైట్! వీళ్లకు దెయ్యాలతో మాట్లాడే శక్తి ఉందని, సమస్యలను పరిష్కరించగలరని వీళ్లే క్లెయిమ్ చేస్తారు. ఈ శక్తుల కోసం ఈ రోజు కమలా నదిలో స్నానం చేయడం అనేది వీళ్లకంతా ఒక ఒక ప్రమాణ స్వీకారం లాంటిది!
ఈ ఉత్సవానికి నేపాల్లోని సప్తరి, మహోత్తరి, ఉదయపూర్ జిల్లాల నుంచే కాదు... మన దేశం నుంచీ (ముఖ్యంగా బిహార్లోని మధుబని, దర్భంగా, సమస్తిపూర్, జయనగర్ వంటి ప్రాంతాల నుంచి) వేలాది మంది వెళ్తారు. భక్తులు స్నానం పూర్తయ్యాక, కమలా నదిలోని పవిత్ర జలాన్ని తీసుకొని తమ ఇళ్లకు వెళ్తారు. ఆ నీటిని ఇంటి చుట్టూ చల్లితే, ఆ స్థలం శుద్ది అవుతుందని, దుష్ట శక్తులు రాకుండా ఉంటాయని వాళ్ల నమ్మకం. ఈ రోజు నదిలో మునిగితే కష్టాలు, పోరాటాలు, పాపాల నుంచి విముక్తి లభిస్తుందని గట్టిగా విశ్వసిస్తారు.
సహజంగానే, కార్తీక పౌర్ణమికి 15 రోజుల ముందు నుంచే ఉపవాస దీక్షలు మొదలుపెడతారట. ఆ రోజు సంగీత వాయిద్యాలతో నది దగ్గరికి వచ్చి, పవిత్ర జలం తాగి, స్నానం చేస్తారు. ఉపవాసం చేయలేని వాళ్లు పండ్లు తీసుకుంటారట. మరి, ఈ రోజున చాలా మంది కొత్త వాళ్లు కూడా నదిలో స్నానం చేస్తారు. వీళ్లంతా శమన్లుగా మారాలనుకునే శిష్యులు! పవిత్ర స్నానం చేయడం ద్వారా తమకు ఆత్మశక్తి వస్తుందని నమ్ముతారు. గురువు మంత్రం ఇవ్వగానే వీళ్ల శిక్షణ పూర్తవుతుంది. ఏది ఏమైనా, శతాబ్దాలుగా వస్తున్న ఈ మిథిలాంచల్ సంస్కృతి మనందరికీ ఒక ఆసక్తికరమైన అనుభూతిని ఇస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa