ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాణి మహల్.. భార్య కోసం నేపాలీ కట్టించిన ‘తాజ్‌మహల్’

international |  Suryaa Desk  | Published : Wed, Nov 05, 2025, 09:15 PM

హిమాలయ దేశం నేపాల్ ‘తాజ్ మహల్’ ఇది. దీన్ని ‘రాణి మహల్’ అని పిలుస్తారు. నేపాల్ పశ్చిమ ప్రాంతంలో కాలిగండకి నది ఒడ్డున ఒక పెద్ద బండరాయిపై ఈ చారిత్రక కట్టడాన్ని నిర్మించారు. నది ఒడ్డున ఈ పాలరాతి సౌధం, దాని చుట్టూ ప్రకృతి అందాలు.. పర్యాటకులకు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఇటీవల ఈ రాణి మహల్‌కు పర్యాటకుల రాక బాగా పెరిగింది. భారత్ నుంచి కూడా చాలా మంది పర్యాటకులు నేపాల్ వెళ్లి రాణి మహల్‌ను సందర్శిస్తున్నారు. కొండల మధ్య, గలగల పారుతోన్న స్వచ్ఛమైన నది పక్కన ఉన్న ప్రశాంత వాతావరణం పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా మారింది.


ఈ రాణి మహల్‌కు కూడా తాజ్‌మహల్ లాంటి చరిత్రే ఉంది. 1893లో జనరల్ ఖడ్గ షంషేర్ తన భార్య తేజ్ కుమారి మరణానంతరం.. ఆమె జ్ఞాపకార్థం ఈ మహల్‌ను నిర్మించారు. నదీ తీరంలో నిర్మించిన ఈ కట్టడంలో అనేక సౌకర్యాలు కల్పించారు. నాలుగు అంతస్తుల్లో ఈ భవనం నిర్మించారు. దీని ఎత్తు 112 అడుగులు, వెడల్పు 56 అడుగులు. ఐరోపా, నియోక్లాసికల్ శైలిలో ఈ భవనాన్ని నిర్మించారు. ఈ భవనంలో తూర్పు వైపున ఖడ్గ షంషేర్ ప్రార్థన చేసుకునేందుకు మందిరాన్ని నిర్మించుకున్నాడు.


భవనం పైఅంతస్తులో కూర్చునే గదులు, మధ్య అంతస్తులో పడకగదులు ఉంటాయి. భవనం చుట్టూ అందమైన తోటలు ఉన్నాయి. భవనం గేటు నుంచి కాలిగండకి నది వరకు మెట్లు ఉన్నాయి. ఈ భవనం వద్ద ఒక పురాతన అతిథి గృహం ఉంది. గుర్రపు శాల, రాజుల కాలం నాటి ఇతర ఆనవాళ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. నేపాల్ రాజధాని కాఠ్మాండు నుంచి సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఈ రాణి మహల్ ఉంది. అలాగే, లుంబిని నుంచి 65 కిలోమీటర్లు, పోఖరా నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది.


ఎన్నో ఏళ్ల కిందట నిర్మించిన ఈ రాణి మహల్‌ను ఇటీవల పునరుద్ధరించారు. ఈ పురాతన కట్టడం అందాన్ని, వైభవాన్ని కాపాడేందుకు స్థానిక అధికారులు మరమ్మత్తు పనులు చేపట్టారు. ఈ కట్టడాన్ని సున్నం, చెస్ట్ నట్స్ ఉపయోగించి నిర్మించారని, నదీ తీరంలో ఉండటం వల్ల దీనికి తరచూ నాచు పట్టే అవకాశం ఎక్కువ అని అధికారులు చెబుతున్నారు. ప్రతిరోజూ దీన్ని శుభ్రపరిచేందుకు సిబ్బందిని నియమించారు. ప్రేమకు చిహ్నంగా నిర్మించిన ఈ భవనం వద్దకు తరచూ చాలా మంది జంటలు వస్తుంటాయి. ముక్తినాథ్ ఆలయానికి వెళ్లే భక్తులు ఎక్కువగా ఈ భవనాన్ని చూసేందుకు వస్తుంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa