ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సౌతిండియా పాపులర్ హామీతో.. న్యూయార్క్ మేయర్‌గా గెలిచిన జోహ్రాన్

international |  Suryaa Desk  | Published : Wed, Nov 05, 2025, 09:20 PM

అమెరికా స్థానిక ఎన్నికలు ఫలితాలు అగ్రరాజ్యంలోని అధికార రిపబ్లికన్‌ పార్టీకి కోలుకోలేని షాకిచ్చాయి. న్యూయార్క్ మేయర్ ఈ ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారింది. ఈక్రమంలో న్యూయార్క్ మేయర్ పదవిని డెమోక్రటిక్ పార్టీ గెలుచుకుంది. ఆ పార్టీకి చెందిన, భారతీయ మూలాలున్న జోహ్రాన్ మందానీ గెలిచి.. చరిత్ర సృష్టించారు. మందానీని ఎదుర్కొవడం స్వయంగా ట్రంప్ రంగంలోకి దిగినప్పటికీ లాభం లేకుండా పోయింది. మందానీ న్యూయార్క్ మేయర్‌గా విజయం సాధించి.. అతి చిన్న వయసులో ఈ పదవి చేపట్టనున్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు.


ఇదిలా ఉంటే ఎన్నికల వేళ మందానీ ఇచ్చిన హామీలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. కారణం ఆయన కూడా దక్షిణ భారతదేశంలో కర్ణాటకతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న పాపులర్ హామీ అయిన ఉచిత బస్సు ప్రయాణంపై హామీ ఇచ్చారు. తనను గెలిపిస్తే న్యూయార్క్‌లో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తానని జోహ్రాన్ మందానీ ఎన్నికల వేళ ప్రకటించారు. ఇప్పుడు దీనిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆ వివరాలు..


న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాన్ మందానీ విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించినవి ఆయన ఇచ్చిన హామీలు. వీటిల్లో ముఖ్యమైంది.. తనను గెలిపిస్తే.. న్యూయార్క్‌లో ఉచిత సిటీబస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. దీంతో పాటు నగరంలో అద్దెలను స్థిరీకరిస్తానని, పిల్లల సంరక్షణతో పాటుగా.. నగరంలో ప్రభుత్వమే నిర్వహించే కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేస్తానని తెలిపారు. అలానే 2030 నాటికి కనీస వేతనాల పెంపుతో పాటు.. కార్పొరేట్లు, సంపన్నులపై పన్ను పెంచి.. వేతన జీవులు, సామాన్యుల జీవన వ్యయాలను తగ్గిస్తానని ప్రచారంలో మందానీ హామీ ఇచ్చారు.


వీటిల్లో సిటీలో మెట్రో బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తాననే హామీ అందరిని ఆకర్షించడమే కాక.. చివరకు జోహ్రాన్ మందానీని గెలిపించింది. దీనిపై ప్రస్తుతం నెట్టింట ఆసక్తికర చర్చ సాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా కర్ణాటలో కూడా ప్రస్తుతం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంది. అలానే త్వరలోనే మరిన్ని రాష్ట్రాలు దీన్ని అమలు చేయాలని భావిస్తున్నాయి. ఇప్పుడిది అమెరికాలో కూడా అమలు కావడం ఆసక్తికరంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో అమలయ్యే పథకాలు.. విదేశీయులను కూడా ఆకర్షించడం ఆసక్తికరంగా మారింది.


ఉచిత బస్సు ప్రయాణం పథకం విషయానికి వస్తే మన దేశంలో ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేశారు. 2019, అక్టోబర్ 29న ఈ పథకం ప్రారంభం అయ్యింది. దీనిలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు గాను పింక్ టికెట్ జారీ చేసేవారు.


జోహ్రాన్ మందానీ విషయానికి వస్తే.. ఆయన భారత మూలాలు ఉన్న వ్యక్తి. ఈయన తల్లి.. ప్రఖ్యాత దర్శకురాలు మీరా నాయర్. దీంతో మందానీకి హిందీ బాగా వచ్చు.. ఒడియా కూడా మాట్లాడగలరు. ఆయన మంచి వక్త. న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు. విజయం సాధించిన తర్వాత మందానీ చేసిన తొలి ప్రసంగంలో భారత మొదటి ప్రధాని నెహ్రూ చేసిన 'ట్రైస్ట్ విత్ డెస్టినీ' ప్రసంగాన్ని ప్రస్తావించడం విశేషం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa