ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్-పాక్ వివాదం ఆపింది నేనే

international |  Suryaa Desk  | Published : Thu, Nov 06, 2025, 05:37 PM

భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని, తనవల్లే ఇరు దేశాల మధ్య శాంతి నెలకొందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. వాణిజ్య ఒప్పందాలను రద్దు చేస్తానని బెదిరించడంతోనే అణుశక్తి దేశాలైన భారత్, పాక్‌లు వెనక్కి తగ్గాయని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఆ ఘర్షణలో కూల్చేసిన ఫైటర్ జెట్ల సంఖ్య ఏడు కాదని, ఎనిమిది అని కొత్త లెక్క చెప్పారు. బుధవారం మయామిలో జరిగిన అమెరికా బిజినెస్ ఫోరంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.తాను అధ్యక్షుడయ్యాక ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది ఘర్షణలను ఆపేశానని, అందులో భారత్-పాక్ వివాదం కూడా ఒకటని ట్రంప్ చెప్పుకొచ్చారు. "నేను భారత్, పాకిస్థాన్‌లతో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుపుతున్నాను. అదే సమయంలో వారు యుద్ధానికి సిద్ధమవుతున్నారని ఓ పత్రికలో చదివాను. ఏడు విమానాలు కూల్చివేశారని, ఎనిమిదోది తీవ్రంగా దెబ్బతిందని తెలిసింది. అంటే దాదాపు 8 విమానాలు కూలిపోయాయి. ఇది యుద్ధమే అని గ్రహించాను. మీరు శాంతికి అంగీకరించకపోతే మీతో ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోనని ఇరు దేశాలకు స్పష్టం చేశాను" అని ట్రంప్ వివరించారు.తమ దేశాల వివాదానికి, వాణిజ్యానికి సంబంధం లేదని తొలుత ఇరు దేశాలు వాదించాయని ట్రంప్ తెలిపారు. "మీవి అణ్వస్త్ర దేశాలు. ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుంటే మీతో నేను వ్యాపారం చేయను అని కరాఖండిగా చెప్పాను. ఆ మరుసటి రోజే ఇరు దేశాలు శాంతికి అంగీకరించాయని నాకు ఫోన్ వచ్చింది. అప్పుడు నేను 'థాంక్యూ, ఇప్పుడు వ్యాపారం చేద్దాం' అన్నాను. ఇదంతా సుంకాల వల్లే సాధ్యమైంది" అని ట్రంప్ చెప్పగానే సభికులు హర్షధ్వానాలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa