రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని సాయుధ దుండగులు ప్రైవేట్ బస్సును అడ్డగించి, తుపాకీతో బెదిరించి దోపిడీకి యత్నించారు. ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 6వ తేదీ రాత్రి జైసల్మేర్ నుంచి ఢిల్లీ వెళుతున్న ప్రైవేట్ బస్సు దేదా గ్రామం సమీపంలోకి రాగానే ఈ ఘటన జరిగింది. క్యాంపర్ వాహనంలో వచ్చిన దుండగులు బస్సును ఓవర్టేక్ చేసి ఆపేశారు. వాహనం నుంచి ఇద్దరు వ్యక్తులు కిందకు దిగారు. వారిలో ఒకడు ముఖానికి ముసుగు ధరించగా, మరొకడు తుపాకీతో కనిపించాడు. వారు గాల్లోకి కాల్పులు జరిపి, బస్సులోకి చొరబడి డ్రైవర్, ఇతర సిబ్బందిని బెదిరించారు.మద్యం తాగడానికి రూ. 5,000 ఇవ్వాలని దుండగులు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకుండా ఈ మార్గంలో బస్సు నడపవద్దని హెచ్చరించారు. సిబ్బంది నిరాకరించడంతో, బుద్ధ్ సింగ్ సోధా అనే వ్యక్తి తుపాకీ గురిపెట్టగా, శ్రవణ్ సింగ్ ఖిర్జా అనే మరో వ్యక్తి చంపేస్తామని బెదిరించినట్లు ఏఎస్పీ భూపాల్ సింగ్ లఖావత్ తెలిపారు.బస్సు యజమాని గణపత్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు బుద్ధ్ సింగ్, శ్రవణ్ సింగ్లపై కేసు నమోదు చేశారు. బస్సులోని సీసీటీవీ ఫుటేజీలో నిందితుల్లో ఒకరు తుపాకీతో వాహనం ముందు నిలబడిన దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయని షేర్గఢ్ ఎస్హెచ్వో బుధారామ్ చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు గ్రామీణ ఎస్పీ నారాయణ్ టోగస్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఏఎస్పీ లఖావత్ భరోసా ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa