వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభోత్సవంలో పాఠశాల విద్యార్థులతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గీతాన్ని పాడించడంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ సూత్రాలను బాహాటంగా ఉల్లంఘించడమేనని, అత్యంత ప్రమాదకరమైన చర్య అని ఆయన అభివర్ణించారు. సంఘ్ పరివార్ రాజకీయాలతో రైల్వే వంటి జాతీయ సంస్థల స్థాయిని దిగజార్చుతున్నారని ఆయన ఆరోపించారు.శనివారం ఎర్నాకులం నుంచి బెంగళూరుకు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పాఠశాల విద్యార్థులు ఆరెస్సెస్ గీతాన్ని ఆలపించారు. ఈ దృశ్యాలతో కూడిన వీడియోను దక్షిణ రైల్వే తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే, దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆ పోస్టును తొలగించింది.ఈ ఘటనపై సీఎం పినరయి విజయన్ ఎక్స్ వేదికగా స్పందించారు.ఎర్నాకులం-బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవంలో విద్యార్థులతో ఆరెస్సెస్ గీతాన్ని పాడించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. విద్వేషాన్ని, మతతత్వ భావజాలాన్ని ప్రచారం చేసే సంస్థ గీతాన్ని అధికారిక కార్యక్రమంలో చేర్చడం రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొన్నారు.ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకోవడం ద్వారా జాతీయ సంస్థలు సంఘ్ పరివార్ రాజకీయాలకు ఎలా బలైపోతున్నాయో రైల్వే అధికారులే బయటపెట్టారు. ఒకప్పుడు లౌకిక జాతీయవాదానికి ప్రతీకగా నిలిచిన రైల్వే, ఇప్పుడు మత తత్వ భావజాలాన్ని చొప్పించే సాధనంగా మారుతోంది. ఈ ప్రమాదకర చర్యను లౌకిక, ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకమై ప్రతిఘటించాలి అని ఆయన పిలుపునిచ్చారు.సీపీఎం రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు.వందే భారత్ ప్రారంభోత్సవాన్ని పూర్తిగా రాజకీయం చేశారు. ఇందులో ఆరెస్సెస్ గీతాన్ని ప్రధానంగా చేర్చడం ద్వారా భారతీయ రైల్వే కొత్త అథమస్థాయికి దిగజారింది. కొత్త సర్వీసుల ప్రకటనలు కూడా రాజకీయ ఆర్భాటంగా మారి, ప్రజాప్రతినిధులను పక్కనపెడుతున్నాయి అని ఆయన విమర్శించారు. టీవీ ఛానళ్లలో ప్రసారమైన దృశ్యాల్లో విద్యార్థులు రైలులో ఆరెస్సెస్ గీతం పాడుతున్నట్లు స్పష్టంగా కనిపించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa