ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెల్లూరులో చిరువ్యాపారులపైకి దూసుకెళ్లిన కంటైనర్

Crime |  Suryaa Desk  | Published : Tue, Nov 11, 2025, 10:33 PM

తెలుగు రాష్ట్రాలను రహదారి ప్రమాదాలు వీడటం లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట ప్రమాదం జరుగుతూనే ఉంది. మంగళవారం నెల్లూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. రిగింది. నెల్లూరు ఎన్టీఆర్ నగర్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చేపల లోడ్‌తో వెళ్తున్న కంటైనర్ అదుపుతప్పి జాతీయ రహదారిపై బీభత్సం సృష్టించింది. రహదారిపై ఉన్న చిరువ్యాపారుల మీదకు వేగంగా దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే టాటా ఏస్ వాహనంతో పాటుగా, మూడు బైకులను ఢీకొట్టింది. అనంతరం చెట్టును ఢీకొట్టి నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో ఘటనాస్థలిలోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలు కాగా.. వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.


మరోవైపు ప్రమాదం జరిగిన ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ ప్రాంతంలో చాలా మంది రోడ్డు పక్కన బండ్లమీద వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి చోట కంటైనర్ లారీ దూసుకుని రావటంతో.. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరోవైపు గాయపడిన వారిలో కొంతమంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.


మరోవైపు ఈ ప్రమాదంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. నెల్లూరులోని వేణుగోపాలస్వామి కళాశాల మైదానం వద్ద హైవేపై ఘోర ప్రమాదం జరిగి పలువురు ప్రాణాలు కోల్పోడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. నిత్యం తాను రాకపోకలు సాగించే మార్గంలో ఈ దారుణం జరగడం జీర్ణించుకోలేకపోతున్నానంటూ సోమిరెడ్డి ట్వీట్ చేశారు. మొక్కజొన్న కంకులు అమ్ముకునే వారితో పాటు వాటిని కొనుగోలు చేసేందుకు వచ్చిన వారిపై లారీ దూసుకెళ్లడం బాధాకరమని పేర్కొన్నారు. జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రమాదంలో మృతిచెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, తీవ్రగాయాలపాలైన వారు క్షేమంగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానంటూ సోమిరెడ్డి ట్వీట్ చేశారు.


మరోవైపు కృష్ణా జిల్లా ఉయ్యూరులో కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. గండిగుంట సమీపంలో నేషనల్ హైవేపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి జాతీయ రహదారి మీద నుంచి సర్వీసు రోడ్డు మీదకు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలోముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. ప్రమాదంలో చనిపోయిన వారు కుందేరు, విజయవాడ వాసులుగా పోలీసులు గుర్తించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa