ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ ఎర్రకోట వద్ద భారీ పేలుడు.. అప్రమత్తమైన యూకే, యూఎస్

international |  Suryaa Desk  | Published : Tue, Nov 11, 2025, 10:32 PM

దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం చారిత్రక ఎర్రకోట సమీపంలో సంభవించిన పేలుడు గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ శక్తివంతమైన కారు పేలుడు దేశ భద్రతా వ్యవస్థకే సవాలు విసిరింది. ముఖ్యంగా లాల్ ఖిలా మెట్రో స్టేషన్ గేట్ నెంబర్.1 వద్ద రద్దీగా ఉండే ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన ఒక నెమ్మదిగా కదులుతున్న కారులో సరిగ్గా సాయంత్రం 6.52 గంటలకు ఈ ఘోరం చోటుచేసుకుంది. ఈ పేలుడు ధాటికి ఇప్పటి వరకు 13 మంది ప్రాణాలు కోల్పోగా.. 15 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. అయితే ఈ ఘటనపై యూకే, యూఎస్ వెంటనే స్పందించాయి. రెండు దేశాలు అప్రమత్తమై.. తమ దేశ పౌరులకు కీలక హెచ్చరికలు జారీ చేశాయి.


సోమవారం సాయంత్రం పేలుడు జరిగిన వెంటనే ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. పది అగ్నిమాపక టెండర్లు రంగంలోకి దిగి 7.29 కల్లా మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే అప్పటికే కారుతో పాటు ఆరు కార్లు, రెండు ఈ-రిక్షాలు, ఒక ఆటోరిక్షా పూర్తిగా కాలిపోయాయి. పేలుడు తీవ్రత వల్ల సమీపంలోని వాహనాల అద్దాలు కూడా పగిలిపోయాయి. అలాగే శబ్దం సెంట్రల్ ఢిల్లీలోని ఐటీఓ వరకు వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గాయపడిన వారందరినీ సమీపంలోని ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్యం అందిస్తున్నారు.


ఈ ఘటన నేపథ్యంలో కేంద్రం తక్షణమే అప్రమత్తమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీశ్ గోల్చా తెలిపిన వివరాల ప్రకారం.. పేలుడు జరిగిన కారులో ఇద్దరు నుంచి ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ బృందాలు ఆధారాలు సేకరిస్తున్నాయి. పేలుడుకు కారణాన్ని తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని.. ఏ ఒక్క అవకాశాన్నీ కొట్టిపారేయడం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.


అంతర్జాతీయ హెచ్చరికలతో ఆందోళన


ఈ పేలుడు కేవలం జాతీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన రేకెత్తించింది. ముఖ్యంగా ఈ ఘటనపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలోని పేలుడు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే తమ పౌరులకు కాన్సులర్ సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అలాగే తమ దేశం నుంచి పౌరులు ఎవరూ ఇప్పుడు ఢిల్లీకి వెళ్లకూడదని సూచించారు. మరోవైపు యునైటెడ్ కింగ్‌డమ్ కూడా వెంటనే అప్రమత్తమై తమ ప్రయాణికులకు ప్రయాణ హెచ్చరిక జారీ చేసింది. తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని, భారత దేశంలోని కొన్ని ప్రాంతాలకు ప్రయాణాలను తాత్కాలికంగా విరమించుకోవాలని సూచించింది.


ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలలో తనిఖీలను ముమ్మరం చేయడంతో పాటు ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ హై అలర్ట్ ప్రకటించారు. ఈ ఘటన వెనుక ఉన్న నిజమైన కారణాలు, కుట్రదారుల వివరాలు NIA దర్యాప్తు పూర్తయితేనే వెల్లడయ్యే అవకాశం ఉంది. దేశ రాజధానిలో జరిగిన ఈ ఘటన.. నగర ప్రజల్లో, జాతీయ భద్రతపై తీవ్ర ఆందోళనలను పెంచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa