ఈనెల 10వ తేదీన ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన భారీ కారు పేలుడు దేశ భద్రతా వ్యవస్థలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి కేంద్ర నిఘా, దర్యాప్తు సంస్థలు ముమ్మర దర్యాప్తు చేస్తున్నాయి. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని.. విచారణ జరుపుతున్నాయి. ప్రమాద తీవ్రతను బట్టి.. ఈ దాడికి సంబంధించిన కారణాలను అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా.. జైషే మహ్మద్ చీఫ్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ పేరు తెరపైకి వచ్చింది. ఒకప్పుడు భారత్ అదుపులో ఉన్న మసూద్ అజార్ను.. అతని అనుచరులు విమానాన్ని హైజాక్ చేసి విడిపించుకుపోయారు. అప్పటి నుంచి భారత్పై జరిగిన అనేక ఉగ్రదాడుల వెనుక మసూద్ అజార్ మాస్టర్మైండ్గా ఉన్నాడు.
మసూజ్ అజార్ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించగా.. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మద్దతుతో ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. 56 ఏళ్ల మసూద్ అజార్.. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. 1999లో ఎయిరిండియా ఐసీ-814 విమానం హైజాక్ తర్వాత.. అందులో ఉన్న ప్రయాణికులను విడుదల చేసేందుకు బదులుగా భారత్ వదిలిపెట్టిన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకడు. మసూద్ అజార్ ప్రస్తుతం పాకిస్తాన్లోని బహావల్పూర్ నుంచి తన ఉగ్ర కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. అయితే మసూద్ అజార్ తమ దేశంలో లేడని పాకిస్తాన్ చెబుతున్నా.. ఇస్లామాబాద్ నీడలోనే స్వేచ్ఛగా తిరుగుతున్నాడని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.
భారత్పై మసూద్ అజార్ ఉగ్రదాడులు
2001లో పార్లమెంట్పై ఉగ్రదాడి
2008 ముంబై దాడులు (26/11 దాడులు)
2016 పఠాన్కోట్ ఎయిర్బేస్పై ఉగ్రదాడి
2019 పుల్వామా ఉగ్రదాడి
తాజాగా ఢిల్లీ పేలుడు కేసులో కూడా అరెస్ట్ అయిన అనుమానితులకు జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థతో లింకులు బయటపడటంతో ఆ ఉగ్రవాద సంస్థ పాత్ర మరోసారి వెలుగులోకి వచ్చింది. దశాబ్దాలుగా అనేక మంది జైషే మహమ్మద్ నాయకులు, అతని కుటుంబ సభ్యులు హతమైనా.. మసూద్ అజార్, అతని ఉగ్ర సంస్థ మాత్రం పాకిస్తాన్ మద్దతుతో బలంగానే ఉంది.
జమాత్ ఉల్-మోమినాత్ - జైష్ మహిళా బ్రిగేడ్
మసూద్ అజార్ నేతృత్వంలోని జైషే మహ్మద్ ఉగ్రసంస్థ ఇటీవల జమాత్ ఉల్-మోమినాత్ పేరుతో ఒక మహిళా బ్రిగేడ్ను మొదలుపెట్టింది. మత విద్య ముసుగులో మహిళలను ఉగ్రవాద భావజాలంలోకి దించడమే లక్ష్యంగా దీన్ని చేపట్టారు. మసూద్ అజార్ సోదరి సాదియా అజ్ఫర్.. ఈ జమాత్ ఉల్ మోమినాత్కు నాయకత్వం వహిస్తోంది. 2019 పుల్వామా దాడి మాస్టర్ మైండ్ ఉమర్ ఫారూక్ భార్య అఫిరా బీబీ కూడా ఇందులో చేరింది. ఢిల్లీ పేలుడుకు సంబంధించి అరెస్ట్ అయిన ఫరీదాబాద్ మెడికల్ కాలేజీ డాక్టర్ షహీన్ సయీద్.. ఈ మహిళా బ్రిగేడ్ భారత విభాగాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉన్నట్లు ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో తేలింది.
ఈ ఏడాది మే నెలలో పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో.. మసూజ్ అజార్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారత వైమానిక దళం చేసిన దాడుల్లో బహావల్పూర్లోని మసూద్ అజార్ ఉగ్రవాద క్యాంపు ధ్వంసం అయింది. ఈ దాడుల్లో మసూద్ అజార్ అన్న భార్య, మేనల్లుడు సహా అతని కుటుంబంలోని 10 మంది సభ్యులు ఒకేసారి హతం కాగా.. అతడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa