ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖైదీల ముందస్తు విడుదలపై రాష్ట్రాలకి సుప్రీంకోర్టు గడువు

national |  Suryaa Desk  | Published : Thu, Nov 13, 2025, 01:44 PM

ఖైదీల ముందస్తు విడుదల (రెమిషన్) విధానాలను పూర్తిగా అమలు చేయడంలో విఫలమైన ఐదు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు చివరి అవకాశం ఇచ్చింది. అస్సాం, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు రెండు నెలల్లోగా ఈ విధానాలను సంపూర్ణంగా అమలు చేయాలని గురువారం గడువు విధించింది.జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం.. బెయిల్, రెమిషన్ విధానాలకు సంబంధించిన సమస్యలపై సుమోటోగా విచారణ చేపట్టిన 'ఇన్ రీ: పాలసీ స్ట్రాటజీ ఫర్ గ్రాంట్ ఆఫ్ బెయిల్' కేసులో ఈ ఆదేశాలు జారీ చేసింది. లిజ్ మాథ్యూ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఈ ఐదు రాష్ట్రాలు తమ ముందస్తు విడుదల విధానాలను, నిబంధనలను ఇంకా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని గుర్తించింది.రాష్ట్ర ప్రభుత్వాల తరఫున చేసిన విజ్ఞప్తిని అంగీకరిస్తూ, "చివరి అవకాశంగా, ఈ ఐదు రాష్ట్రాలు పూర్తిస్థాయిలో నిబంధనలు పాటించేందుకు ఈ ఉత్తర్వుల తేదీ నుంచి రెండు నెలల సమయం ఇస్తున్నాం" అని ధర్మాసనం స్పష్టం చేసింది.అదే సమయంలో కేరళ పాక్షికంగానే నిబంధనలు అమలు చేసిందని పేర్కొన్న కోర్టు, ముందస్తు విడుదల అభ్యర్థనలను తిరస్కరించినప్పుడు కారణాలను తప్పనిసరిగా వెల్లడించేలా చట్టపరమైన సవరణ చేసేందుకు నాలుగు నెలల గడువు ఇచ్చింది.ఈ సందర్భంగా ధర్మాసనం కీలకమైన సూచన చేసింది. ఒక ఖైదీ ముందస్తు విడుదలకు అర్హత సాధించడానికి కనీసం ఆరు నెలల ముందే అతని కేసును రాష్ట్ర ప్రభుత్వాలు సమీక్షించాలని ఆదేశించింది. దీనివల్ల అర్హత పొందిన తర్వాత కూడా ఖైదీలు అనవసరంగా జైలులో గడపాల్సిన పరిస్థితిని నివారించవచ్చని అభిప్రాయపడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa