బిహార్ రాజకీయాల్లో ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం చక్రం తిప్పింది. లాలూ ప్రసాద్ యాదవ్ , ఆయన భార్య రబ్రీ దేవి.. బిహార్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అయితే లాలూ కుటుంబంపై వచ్చిన తీవ్ర అవినీతి ఆరోపణలు.. ఆయన పరిపాలించిన కాలాన్ని బిహార్లో జంగల్రాజ్గా పిలవడంతో.. ఆయనపై, ఆయన కుటుంబంపై బిహార్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయితే 2015లో లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. రెండుసార్లు బిహార్ డిప్యూటీ సీఎంగా పనిచేసిన తేజస్వీ యాదవ్.. ఈ ఎన్నికల్లో మహాఘట్బంధన్కు ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా నిలిచినా.. కూటమి ఘోర పరాజయం పాలు కావడంతో ఈసారి కూడా ఆ కోరిక నెరవేరలేదు.
తేజస్వీ యాదవ్ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా యూపీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. అయితే.. లాలూ ప్రసాద్ యాదవ్పై అప్పట్లో వచ్చిన అనేక అవినీతి ఆరోపణలు.. ఆయన ప్రతిష్ఠను దిగజార్చాయి. ఇక లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లిన సమయంలో.. ఆయన భార్య, తేజస్వీ యాదవ్ తల్లి రబ్రీ దేవి.. బిహార్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ రబ్రీ దేవి ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్లగా.. గెలిచి మరోసారి ఆమె ముఖ్యమంత్రి అయ్యారు. ఇదందా 1995 నుంచి 2005 మధ్య జరిగింది.
అయితే బిహార్లో 1995 -2005 మధ్య అరాచక పాలన రాజ్యమేలిందని రాజకీయ విమర్శకులు పేర్కొంటారు. అందుకే లాలూ ప్రసాద్ యాదవ్, ఆర్జేడీ పాలనను బిహార్ రాజకీయాల్లో జంగిల్ రాజ్గా అభివర్ణిస్తారు. ఆ సమయంలో ఆ రాష్ట్రంలో జరిగిన నేరాలు, కిడ్నాప్లు, అవినీతి వంటి అనేక సమస్యలు బిహార్ను ఆటవిక రాజ్యంగా మార్చేశాయనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. మహాఘట్బంధన్ ఇప్పుడు అధికారంలోకి వస్తే మళ్లీ బిహార్లో జంగిల్ రాజ్ రావడం ఖాయం అంటూ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విస్తృతంగా ప్రచారం చేసింది.
అభివృద్ధి, సుస్థిరమైన పాలనతో కూడిన రాజ్యం కావాలో.. లేక దమ్కీలు, దోపీడీల రాజ్యం కావాలా అని ఎన్డీఏ కూటమి బిహార్ ఓటర్లకు ప్రశ్నలు సంధించింది. బిహార్ లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి పాలన మళ్లీ రావద్దంటూ ఉండాలంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలని.. అసెంబ్లీ ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ పెద్దలు చేసిన ప్రసంగాలు కూడా ఓటర్లను ఆకట్టుకున్నాయి. దీంతో అదే నమ్మిన బిహార్ ఓటర్లు.. మళ్లీ ఎన్డీఏకు పట్టం కట్టాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa