దేశం దృష్టిని ఆకర్షించిన బీహార్ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీయే కూటమి ఘన విజయాన్ని నమోదు చేస్తుంటే.. ఇద్దరు సీనియర్ మంత్రులు సాధిస్తున్న వ్యక్తిగత విజయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బీజేపీకి చెందిన ప్రేమ్ కుమార్, జేడీ(యూ)కి చెందిన బిజేంద్ర ప్రసాద్ యాదవ్ వరుసగా తొమ్మిదో సారి ఎమ్మెల్యేలుగా గెలుపొందే దిశగా దూసుకుపోతున్నారు.
ప్రస్తుత సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ కేవలం మూడు నెలల శిశువుగా ఉన్న 1990లో ఈ ఇద్దరు నేతలు మొదటి సారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నిక అయ్యారు. అప్పటి నుంచి మూడున్నర దశాబ్దాల పాటు తమ నియోజక వర్గాల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించారు. ఓట్ల లెక్కింపు ఆరు గంటలకు పూర్త కానునప్పటికీ.. వారి స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఈ చారిత్రక విజయాన్ని దాదాపు ఖాయం చేసుకున్నారు.
ప్రేమ్ కుమార్ గయా టౌన్ నియోజకవర్గం నుంచి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్ సుపౌల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ ఇద్దరు నేతలు నితీష్ కుమార్ కేబినెట్లో కీలక మంత్రులుగా ఉన్నారు. ప్రేమ్ కుమార్ సహకార మరియు పర్యావరణ శాఖలను నిర్వహిస్తుండగా.. బిజేంద్ర యాదవ్ విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. ప్రేమ్ కుమార్ తన గయా టౌన్ స్థానంలో కాంగ్రెస్కు చెందిన అఖౌరి ఓంకార్ నాథ్, జన్ సురాజ్ పార్టీ అభ్యర్థి ధీరేంద్ర అగర్వాల్ వంటి వారి నుంచి పోటీని ఎదుర్కొన్నారు. అయినప్పటికీ.. ఆయన తన ప్రధాన ప్రత్యర్థి కంటే స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. అదే విధంగా బిజేంద్ర యాదవ్ కూడా సుపౌల్లో కాంగ్రెస్ అభ్యర్థి మిన్నతుల్లా రెహమానీపై సులభంగా ముందంజలో ఉన్నారు.
ఈ ఇద్దరు సీనియర్ నేతల విజయం ఎన్డీయే కూటమికి సంబంధించిన మెగా విజయానికి నిదర్శనంగా ఉంది. కౌంటింగ్ సరళి ప్రకారం.. ఎన్డీయే కూటమి ఏకంగా 200 సీట్ల మార్కును దాటి బీహార్ రాజకీయాల్లో తన అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకదాన్ని నమోదు చేసింది. ఈ విజయానికి జేడీ(యూ) భారీగా స్థానాలు పెంచుకోవడంతో పాటు చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ (ఆర్వీ) 22 స్థానాల్లో ఆధిక్యం సాధించడం కూడా దోహదపడింది.
మరోవైపు ప్రతిపక్ష మహాగఠ్బంధన్ శిబిరానికి తీవ్ర నిరాశ ఎదురైంది. 2020లో 75 స్థానాలతో అతి పెద్ద పార్టీగా నిలిచిన ఆర్జేడీ ఇప్పుడు 29 స్థానాలకు పడిపోయింది. కాంగ్రెస్ కేవలం 4 స్థానాల్లోనే ఆధిక్యం కొనసాగిస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలు బీహార్ రాజకీయాల్లో నితీష్-బీజేపీ కూటమి స్థిరత్వాన్ని ప్రేమ్ కుమార్, బిజేంద్ర యాదవ్ వంటి సుదీర్ఘ అనుభవం గల నేతల పాత్రను మరోసారి స్పష్టం చేశాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa