ఆధునిక సాంకేతికతతో ప్రపంచంలో పెను మార్పులు సంభవిస్తున్నా.. భారత్లో మాత్రం కొన్ని సాంఘిక దురాచారాలు సంప్రదాయం ముసుగులో వెలుగుచూస్తూనే ఉన్నాయి. అందులో వరకట్నం ఒకటి. ఇప్పటికీ దేశంలో నిత్యం ఎక్కడో ఒక చోట ఈ దూరాచారానికి మహిళలు బలి అవుతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. చాలా మంది మహిళలు వరకట్న వేధింపులకు బాధితులుగా మారుతున్నారు. ఇలాంటి ఘటన పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం కుందరితిరువాడ గ్రామంలో చోటుచేసుకుంది. భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని.. తొమ్మిది పేజీల లేఖ రాసి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుందరితిరువాడ గ్రామానికి చెందిన పోరెడ్డి ఉమామహేశ్వరావు (32).. అనకాపల్లి జిల్లా కేపీ అగ్రహారం మండల పరిషత్తు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులు లేకపోవడంతో తన చిన్నమ్మ ఇంట్లో ఉండేవాడు. ఈ నేపథ్యంలో కొమరాడ మండలం గుమడ గ్రామానికి చెందిన వీణతో పరిచయం ఏర్పడింది. అనంతరం అది ప్రేమగా మారి.. పెళ్లి పీటల వరకు వెళ్లింది. పెద్దలను ఒప్పించి.. 2024 జనవరి 23న పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయంలో వీణ తల్లిదండ్రులు కట్నకానుకల.. రూపంలో రూ. 20 లక్షలు ముట్టజెప్పారు. అంతేకాకుండా ఐదు తులాల బంగారం ఇచ్చారు. ఉమామహేశ్వరరావు.. భార్యతో చోడవరంలో కాపురం పెట్టాడు. వీరికి కుమారుడు జన్మించాడు.
అందరిముందు మంచిగా నటిస్తూ..
కాగా, పెళ్లైన కొన్నాళ్లు ఇద్దరు అన్యోన్యంగానే ఉన్నారు. ఆ తర్వాత వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. ప్రేమించి పెళ్లిచేసుకున్న ఉమామహేశ్వరరావు.. ఆ తర్వాత అదనపు కట్నం కోసం వేధించే వాడని వీణ ఆవేదన వ్యక్తం చేసేది. ఈ క్రమంలో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. వీణ మృతదేహం వద్ద 9 పేజీల లేఖ లభ్యమైంది. అందులో.. "ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకున్న తర్వాత అతడి అసలు రూపం బయటపడింది. బయట అందరిముందు మంచిగా నటిస్తూ.. అదనపు కట్నం కోసం వేధించే వాడు. దీనికి అతడి బంధువులు తోడయ్యారు. నాకు వచ్చిన ఈ పరిస్థితి ఇంకెవరికీ రాకూడదు. అందకే ప్రేమించిన వారిని పెళ్లిచేసుకునే ముందే బాగా ఆలోచించి పెళ్లి చేసుకోండి" అంటూ పేర్కొంది. అయితే వీణ.. ఆరు నెలల వయసున్న తన కుమారుడిని ఊపిరాడకుండా చేసింది. ఆ తర్వాత ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. వీణ మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
కట్నం కోసం వేరే పెళ్లి..
కట్నం కోసం వేరే పెళ్లి చేసుకునేంతలా ఉమామహేశ్వరరావులో మార్పు వచ్చిందని వీణ తల్లిదండ్రులు ఆరోపించారు. వీణ మృదుస్వభావి అని.. ఆమె ఎవరితోనూ పెద్దగా మాట్లాడేది కాదని చెప్పారు. మరింత కట్నం ఇవ్వాలని వీణతో భర్త తరచూ గొడవ పడేవాడని చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన వీణ.. ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa