ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో మరో గ్రీన్‌ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు.... చంద్రబాబు సమక్షంలో ఒప్పందం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 15, 2025, 07:29 PM

ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త ఎయిర్‌పోర్టు నిర్మాణం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఏపీలో ప్రస్తుతం 7 విమానాశ్రయాలు అందుబాటులో ఉన్నాయి. అయితే మరో ఏడు కొత్త ఎయిర్‌పోర్టులను ఏర్పాటు చేసి.. ఏపీని లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా ఉత్తరాంధ్రలో మరో విమానాశ్రయం ఏర్పాటు చేయనున్నారు. ఉత్తరాంధ్రలో ఇప్పటికే విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులో ఉంది. దీనికి జతగా విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నారు.


2026 జూన్ నాటికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం) నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రలో మరో ఎయిర్‌పోర్టు ఏర్పాటు దిశగా శనివారం కీలక ఒప్పందం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది.


శ్రీకాకుళం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌ పోర్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మధ్య శనివారం అవగాహన ఒప్పందం కుదిరింది. సీఎం చంద్రబాబు, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సమక్షంలో ఎంఓయూ పత్రాలపై సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్రకు కనెక్టివిటీ పెరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఎయిర్ పోర్టు వలన ఆ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి కావటంతో పాటుగా పర్యాటకంగానూ లాభం చేకూరుతుందన్నారు. శ్రీకాకుళం ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం ప్రస్తుతం స్థలాలను పరిశీలిస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు.


మరోవైపు శ్రీకాకుళానికి సుమారుగా 70 కిలోమీటర్ల దూరంలో.. సముద్ర తీరానికి సమీపంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎయిర్ పోర్టు నిర్మా్ణం కోసం పలు ప్రాంతాల్లో స్థలాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే జూన్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ భోగాపురం ఎయిర్ పోర్టు పనులు సుమారుగా 92 శాతం పూర్తయ్యాయి.


డిసెంబర్ నెలలో ఫ్లైట్ టెస్ట్ చేయనున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇటీవల ప్రకటించారు. మరోవైపు భోగాపురం విమానాశ్రయం లో విమానయాన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు రామ్మోహన్ నాయుడు ఇటీవల తెలిపారు. భోగాపురం విమానాశ్రయం పూర్తి అయితే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ఎయిర్‌పోర్టును ప్రారంభించనున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa