ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖలో విజయవంతంగా ముగిసిన సీఐఐ భాగస్వామ్య సదస్సు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 15, 2025, 08:59 PM

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతిలో విశాఖ సాగర తీరం సరికొత్త చరిత్రను లిఖించింది. రాష్ట్ర ప్రభుత్వం, సీఐఐ సంయుక్తంగా నిర్వహించిన 30వ భాగస్వామ్య సదస్సు అంచనాలకు మించి అద్భుత విజయం సాధించింది. రాష్ట్రానికి పెట్టుబడుల సునామీని తీసుకొచ్చింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో ఏకంగా రూ.13,25,716 కోట్ల విలువైన పెట్టుబడులపై ఒప్పందాలు  కుదిరాయి. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో 16,31,188 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.వాస్తవానికి ఈ సదస్సును రెండు రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం మొదట భావించింది. సుమారు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేసింది. అయితే, పారిశ్రామికవేత్తల నుంచి అనూహ్య స్పందన రావడంతో సదస్సును మరో రోజు పొడిగించాల్సి వచ్చింది. పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశీ సంస్థలు భారీగా తరలిరావడంతో అంచనాలను మించి ఏకంగా 30 శాతం అధికంగా, అంటే రూ.13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి రావడం ప్రభుత్వ వర్గాల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింది.కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామికాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. క్రమం తప్పకుండా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి  సమావేశాలు నిర్వహిస్తూ పరిశ్రమలకు శరవేగంగా అనుమతులు మంజూరు చేశారు. దీనికి కొనసాగింపుగా, రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి స్వయంగా సింగపూర్, యూఏఈ, లండన్ వంటి దేశాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలను సదస్సుకు ఆహ్వానించారు. ఈ కృషి ఫలించి భాగస్వామ్య సదస్సు రికార్డు స్థాయి విజయాన్ని నమోదు చేసింది.మూడు రోజుల పాటు జరిగిన ఈ పెట్టుబడుల మేళాలో సింహభాగం ఒప్పందాలు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే జరగడం విశేషం. మొత్తం 123 ఎంఓయూల ద్వారా రూ.7,63,210 కోట్ల పెట్టుబడులు సీఎం సమక్షంలోనే ఖరారయ్యాయి. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహా ఇతర మంత్రులు కూడా తమ వంతు కృషి చేసి 490 ఎంఓయూల ద్వారా రూ.5,62,506 కోట్ల పెట్టుబడులను సాధించారు. సదస్సులో తొలి రోజు రూ.3.65 లక్షల కోట్లు, రెండో రోజు రూ.3.49 లక్షల కోట్లు, చివరి రోజు రూ.48,430 కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి.ఈ సదస్సు ద్వారా మొత్తం 12 కీలక రంగాల్లోకి పెట్టుబడుల ప్రవాహం రానుంది. ఇందులో ఇంధన, పరిశ్రమలు, మౌలిక వసతుల రంగాలు అత్యధిక పెట్టుబడులను ఆకర్షించాయి.మొత్తం మీద, విశాఖ భాగస్వామ్య సదస్సు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పారిశ్రామిక విధానాలకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వానికి లభించిన గొప్ప విజయంగా నిలుస్తోంది. ఈ ఒప్పందాలు క్షేత్రస్థాయిలో కార్యరూపం దాలిస్తే రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం మారడంతో పాటు, నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa