ప్రపంచ విమానయాన దిగ్గజం బోయింగ్ సంస్థకు అమెరికాలోని చికాగో ఫెడరల్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. 2019లో జరిగిన ఘోర ఇథియోపియన్ ఎయిర్లైన్స్ విమాన ప్రమాదం (737 MAX)లో మృతి చెందిన భారతీయ పౌరురాలు, ఐక్యరాజ్య సమితి కన్సల్టెంట్ శిఖా గార్గ్ కుటుంబానికి 35.85 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 317 కోట్లు) నష్ట పరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఆరేళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత శిఖా గార్గ్ కుటుంబానికి ఈ తీర్పు రూపంలో ఊరట లభించింది. బోయింగ్ సంస్థ విమాన రూపకల్పనలో లోపాలు ఉన్నాయని, అంతేకాకుండా ప్రమాదాల గురించి ప్రజలను హెచ్చరించడంలో విఫలం అయిందని ఆరోపిస్తూ శిఖా గార్గ్ కుటుంబం కోర్టులో దావా వేసింది.
విమాన ప్రమాదంలో 150 మంది మృతి..
శిఖా గార్గ్ అప్పుడు ఐరాస ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొనేందుకు నైరోబీకి వెళ్తున్నారు. పీహెచ్డీ చేస్తున్న ఆమెకు భారతీయ సంస్కృతి, ముఖ్యంగా చీరకట్టు అంటే మక్కువ ఎక్కువని ఆమె కుటుంబ సభ్యులు గుర్తు చేసుకున్నారు. ఇథియోపియాలోని బోలె అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే బోయింగ్ 737 మ్యాక్స్ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 150 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదం జరగడానికి ఐదు నెలల ముందే ఇండోనేసియాలో మరొక బోయింగ్ 737 మ్యాక్స్ విమానం ప్రమాదానికి గురైంది. ఈ రెండు వరుస ఘటనల్లో కలిపి సుమారు 340 మంది మృతి చెందారు. వరుస ప్రమాదాల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని 737 మ్యాక్స్ విమానాల కార్యకలాపాలను నిలిపివేశారు. 2020 డిసెంబర్లో మాత్రమే వాటి కార్యకలాపాలు తిరిగి ప్రారంభం అయ్యాయి.
శిఖా గార్గ్ కుటుంబం వేసిన దావాతో పాటుగా దాదాపు అన్ని కేసులను బోయింగ్ ఇప్పటికే పరిష్కరించుకుంది. అయితే తాజాగా శిఖా గార్గ్ కుటుంబం దాఖలు చేసిన దావాపై వెలువడిన ఈ తీర్పు నష్ట పరిహారం మొత్తంలో ఒక చారిత్రక మైలురాయిగా నిలిచింది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది జూన్లో మరో ఘోరం జరిగింది. బోయింగ్ 787 (డ్రీమ్లైనర్) విమానం అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కూలిపోగా.. అందులో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విమానం మెడికల్ కాలేజీ హాస్టల్పై పడడంతో అక్కడి వారు కూడా మరణించారు. వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలు ప్రపంచ వ్యాప్తంగా బోయింగ్ సంస్థ రూపకల్పన, భద్రతా ప్రమాణాలపై తీవ్ర ఆందోళనను పెంచుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa