సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. హిందూపురంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. హిందూపురం వైసీపీ ఇంఛార్జి దీపిక రెడ్డి భర్త వేణు రెడ్డి ఆఫీసు మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. కార్యాలయం అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. దేవాలయం లాంటి తమ పార్టీ ఆఫీసుపై దాడి చేశారంటూ వైసీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
300 మంది టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా వచ్చి తమ పార్టీ కార్యాలయంపై దాడి చేశారని.. ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసులు అరగంట పాటు రాలేదని ఆరోపించారు. రాజకీయంగా ఏవైనా విమర్శలు చేస్తే, రాజకీయంగానే సమాధానం చెప్పాలి గానీ, ఇలా భౌతిక దాడులు చేస్తారా అని ప్రశ్నించారు.
హిందూపురంలోని వైసీపీ ఆఫీసు మీద టీడీపీ నేతలు, బాలకృష్ణ అభిమానులు చేసిన దాడి.. ప్రజాస్వామ్యంపై జరిగిన ప్రత్యక్ష దాడిగా వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇలాంటి అనాగరిక చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ట్వీట్ చేశారు. ఆఫీసులపై దాడులు చేయటం, ఫర్నీచర్ ధ్వంసం చేయడం, అద్దాలు పగలగొట్టడం, కార్యకర్తలపై భౌతిక దాడులను రాజకీయ పార్టీలు మొదలుపెడితే.. అది ప్రజాస్వామ్యం పతనానికి నిదర్శనమన్నారు.
పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం మరింత ఆందోళన కలిగిస్తోందన్నారు. పోలీసుల మౌనం నిర్లక్ష్యం కాదన్న వైఎస్ జగన్.. చంద్రబాబు రాజకీయ ఎజెండా కోసం ఆంధ్రప్రదేశ్ శాంతిభద్రతల యంత్రాంగాన్ని బహిరంగంగా దుర్వినియోగం చేస్తున్నారనే హెచ్చరిక అంటూ ట్వీట్ చేశారు. ఈ దాడిని వైసీపీతో పాటుగా.. ప్రజాస్వామ్యాన్ని, రాజకీయ స్వే్చ్ఛను నమ్మే ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు.
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున దీపిక బరిలో నిలిచారు. అయితే టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ చేతిలో ఓటమి పాలయ్యారు. హిందూపురం నుంచి బాలయ్య మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. అయితే నందమూరి కుటుంబం హిందూపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఎన్టీఆర్. ఆయన తనయుడు నందమూరి హరికృష్ణ కూడా ఇక్కడి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 1985 నుంచి అంటే తెలుగుదేశం పార్టీ ఏర్పాటైన నాటి నుంచి హిందూపురం నియోజకవర్గ ప్రజలు ఆ పార్టీనే గెలిపిస్తూ వస్తున్నారు. చివరకు వైఎస్ జగన్ సునామీలోనూ 2019లో బాలయ్య ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాయలసీమలో టీడీపీకి మూడు సీట్లు వస్తే.. అందులో హిందూపురం ఒకటి కావటం విశేషం.
అయితే ఈ విషయాలను దృష్టిలో పెట్టుకునే వైసీపీ ఇంఛార్జి దీపిక భర్త వేణు రెడ్డి ఇటీవల హాట్ కామెంట్స్ చేశారు. లేపాక్షిలో జరిగిన వైసీపీ సమావేశంలో మాట్లాడుతూ.. బాలకృష్ణపై కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూపురం ప్రజలు 40 ఏళ్ల నుంచి బానిస బతుకులు బతుకుతున్నారంటూ వేణు రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎక్కడో హైదరాబాద్లో కూర్చున్న వాడి కాళ్ల కింద బానిసలుగా బతుకుతున్నామంటూ పరోక్షంగా బాలకృష్ణను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. వారికి ఓట్లేస్తాం.. వారు హైదరాబాద్లో ఉంటారు.. మనమిక్కడ బానిస బతుకులు బతుకుతున్నామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బాలయ్యపై వేణు రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగానే ఈ దాడి జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa