ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కృష్ణానదిపై ఐకానిక్‌ కేబుల్‌ బ్రిడ్జి.. జనవరిలో పనులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 16, 2025, 07:31 PM

రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ కృష్ణానదిపై ఐకానిక్ కేబుల్ వంతెన రూపుదిద్దుకోనుంది. ప్రపంచంలోనే రెండోసారి.. అలాగే దేశంలోనే తొలిసారిగా కృష్ణానదిపై తీగల వంతెన ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. నంద్యాల జిల్లా సిద్ధేశ్వరం గుట్ట - నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపుర్ సమీపంలోని సోమశిల వరకూ ఈ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మించనున్నారు. ఈ కేబుల్ వంతెన ఏర్పాటు కోసం ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ పూర్తి అయ్యింది. టెండర్ల ప్రక్రియ కూడా ముగిసింది. ఇక పనులు ప్రారంభం కావడమే తరువాయి. అయితే 2026 జనవరి నుంచి కృష్ణానదిపై ఐకానిక్ కేబుల్ వంతెన పనులు ప్రారంభమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కల్వకుర్తి - జమ్మలమడుగు నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా ఈ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఇందుకోసం రూ.1.083 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు.


కృష్ణా నది మీద సోమశిల- సిద్ధేశ్వరం గుట్టల మధ్యన 1.77 కిలోమీటర్ల పొడవుతో ఈ ఐకానిక్ కేబుల్ వంతెన ఏర్పాటు కానుంది. ఈ వంతెన అందుబాటులోకి వస్తే హైదరాబాద్.. తిరుపతి మధ్య ప్రయాణ దూరం తగ్గుతుంది. సుమారుగా 70 కిలోమీటర్ల మేరకు దూరం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే శ్రీశైలం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలవాసులకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు. అలాగే దేశంలోనే తొలిసారిగా ఈ తరహాలో తీగల వంతెన ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఇటు పర్యాటకంగానూ ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అధికారులు చెప్తున్నారు. మొత్తంగా ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యి ఐకానిక్ కేబుల్ వంతెన అందుబాటులోకి వస్తే ఒకే దెబ్బకు మూడు పిట్టలు అనేలా ఉంటుందని అధికారులు చెప్తున్నారు.


ఒకటి.. శ్రీశైలం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు తప్పుతాయి. పుట్టీలు, మరపడవల సాయంతో ప్రయాణించాల్సిన అగత్యం తప్పుతుంది. రెండోదీ.. హైదరాబాద్ నుంచి తిరుపతి వైపు వెళ్లే వాహనదారులకు దూరం తగ్గుతుంది. 70 కిలోమీటర్ల మేరకు దూరం తగ్గటంతో.. ఆ మేరకు గంట, గంటన్నర ప్రయాణ సమయం ఆదా అవుతుంది.


  ఇక మూడోది పర్యాటకం.. కేబుల్ బ్రిడ్జి ఏర్పాటైతే ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతవాసులకు ఉపాధి కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ తీగల వంతెన పనులు వచ్చే జనవరిలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa