బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ దారుణ పరాజయం లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో చిచ్చురేపింది. లాలూ కుమార్తె రోహిణీ ఆచార్య కుటుంబంతో సంబంధాలు తెంచుకున్నట్టు చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఇది ఆమెతోనే ఆగలేదు మరో ముగ్గురు కుమార్తెలు బయటకు వచ్చేశారు. రాజలక్ష్మీ, రాగిణి, చందాలు పట్నాలోని లాలూ నివాసం నుంచి తమ పిల్లలతో సహా ఢిల్లీకి వెళ్లిపోయారు. ఎన్నికలు ఫలితాలు వెలువడిన కొద్ది గంటల్లోనే ఆర్జేడీలో అంతర్గత సంక్షోభం మొదలైంది. సింగ్పూర్లో నివసిస్తోన్న, వృత్తిరీత్యా డాక్టర్ అయిన లాలూ కుమార్తె రోహిణి ఆచార్య, తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని, కుటుంబంతో సంబంధం తెంచుకుంటున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే.
తీవ్ర భావోద్వేగంతో ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయి. తనను అసభ్యపదజాలంతో దూషించాారని, తేజస్వి యాదవ్కు అత్యంత సన్నిహితులైన సంజయ్ యాదవ్ (ఆర్జేడీ రాజ్యసభ సభ్యుడు), రమీజ్ ఘర్షణ సమయంలో ఎవరో తనపై చెప్పుతో దాడి చేయడానికి కూడా ప్రయత్నించారని ఆమె ఆరోపించింది. తన తండ్రికి కిడ్నీని దానం చేసి రోహిణీ ఆచార్య వార్తల్లో నిలిచారు. అయితే, లాలూకు కిడ్నీ ఇచ్చిన తర్వాత తాను కోట్లు తీసుకున్నానని ఆరోపించి అత్యంత అవమానకరంగా మాట్లాడారని రోహిణీ వాపోయారు. గతేడాది లోక్సభ ఎన్నికల్లో ఆర్జేడీ నుంచి పోటీచేసిన రోహిణీ ఆచార్య ఓటమిపాలయ్యారు.
కాగా, గత రెండు రోజులుగా జరుగుతోన్న పరిణామాలతో రాజలక్ష్మీ, రాగిణి, చందాసింగ్లు తీవ్రంగా కలతచెంది ఇంటి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నలుగురు కుమార్తెలు, వారి పిల్లలు బయటకు వెళ్లడంతో ఒకప్పుడు కలకలలాడిన ఆర్జేడీ రాజకీయ కేంద్రం ఇప్పుడు వెలవెలబోతోంది. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి, కుమార్తె మిసా భారతి మాత్రమే అక్కడ మిగిలారు.
ఓటమి తర్వాత తేజస్వి యాదవ్ నాయకత్వం, అలాగే ఆయన సలహాదారులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తేజస్వి బయట ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు. మరోవైపు, ఈ పరిణామాలపై కుటుంబం నుంచి బహిష్కరణకు గురైన లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ స్పందిస్తూ.. తనను ఏమైనా అంటే ఊరుకుంటాను గానీ, తన సోదరిపై దాడిచేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన తేజ్ ప్రతాప్..‘నాన్నా, ఒక్కసారి మీరు సరే అంటే బీహార్ ప్రజలు ఈ జైచందులను పాతిపెడతారు’ అని విజ్ఞప్తి చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ కేవలం 27 స్థానాలకు పరిమితైన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa