ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొడుక్కి ఫోర్త్ స్టేజీ క్యాన్సర్.... అంతా మోదీ, పుతిన్ చేతుల్లో

national |  Suryaa Desk  | Published : Sun, Nov 16, 2025, 08:26 PM

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన మనూ శ్రీవాస్తవకు అన్ష్ శ్రీవాస్తవ అనే 21 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే అన్ష్ క్యాన్సర్ బారిన పడటంతోపాటు.. వ్యాధి ముదిరి నాలుగో స్టేజీలో ఉందని తెలిసి మనూ దంపతులు తల్లడిల్లారు. వెంటనే హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే వ్యాధి ముదరడంతో పూర్తిగా నయమవుతుందని గ్యారంటీ ఇవ్వలేమని డాక్టర్లు చెప్పారు. దీంతో బిడ్డ దక్కడేమో అనే బాధ శ్రీవాస్తవను నిలువనీయడం లేదు. ఎలాగైనా సరే తన కొడుకును కాపాడుకోవాలని ఆ తండ్రి హృదయం పరితపిస్తోంది.


రష్యా క్యాన్సర్‌ను నయం చేసే వ్యాక్సిన్‌ను తయారు చేసిందని.. ప్రయోగ దశలో ఉన్న ఆ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పని చేస్తుందని తెలుసుకున్న మనూ శ్రీవాస్తవ తన కొడుక్కి కూడా ఆ వ్యాక్సిన్ వేయిస్తే ఫలితం ఉంటుందేమోనని భావించాడు. ఆలోచన వచ్చిందే తడవుగా, తన కొడుకు పరిస్థితిని వివరిస్తూ భారత ప్రభుత్వానికి, రష్యా ప్రభుత్వానికి లేఖలు రాశాడు. మీ రిక్వెస్టును పరిగణనలోకి తీసుకుంటున్నాం అని రష్యా ప్రభుత్వం నుంచి మనూకు అక్టోబర్ 27న సమాధానం వచ్చింది. తర్వాతి ప్రక్రియ కోసం రష్యా ప్రభుత్వం ఆరోగ్య శాఖకు ఆ లేఖను, సంబంధిత వివరాలను పంపించింది.


‘‘భారత ప్రభుత్వం కూడా మా లేఖకు స్పందించింది. ఢిల్లీ నుంచి కూడా ఓ లేఖ వచ్చింది. వ్యాక్సిన్‌ను ప్రస్తుతం రష్యాలో తయారుచేస్తున్నారని, అక్కడే పరీక్షిస్తున్నారని తెలిపింది. క్లినికల్ ట్రయల్స్ స్థానికంగా (రష్యాలో) నిర్వహిస్తున్నారు. ఆ వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించడానికి మనకు గానీ, మరే ఇతర దేశానికి గానీ అనుమతులు లేవు’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు అని శ్రీవాస్తవ తెలిపారు.


రష్యా రూపొందిస్తోన్న క్యాన్సర్ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో తన కొడుకు అన్ష్‌ను భాగం చేయాలని కోరుతూ.. ప్రధాని మోదీ, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, రష్యా, దక్షిణ కొరియాల్లోని సీనియర్ అధికారులకు శ్రీవాస్తవ లేఖలు రాశారు. భారత ప్రభుత్వం ఇచ్చిన సమాధానాన్ని బట్టి.. రష్యా నుంచి వ్యాక్సిన్‌ను ఇండియాకు తీసుకొచ్చి.. ఆ యువకుడికి ఇచ్చి పరీక్షించడం కష్టమే కావచ్చు. అయితే భారత్, రష్యా మిత్రదేశాలు.. అంతే కాదు మోదీ, పుతిన్ మధ్య బలమైన స్నేహ సంబంధాలు ఉన్నాయి. కాబట్టి.. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ యువకుడి ప్రాణాలు కాపాడటానికి.. రెండు దేశాల అధినేతలు మనసు పెట్టి ఓ మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అతణ్ని రష్యాకు తీసుకెళ్లి వ్యాక్సిన్ ఇప్పించడమో లేదంటే ఇక్కడికే ఆ వ్యాక్సిన్‌ను తెప్పించి అతడికి ఇవ్వడమో చేసి.. ఆ యువకుడు క్యాన్సర్‌ను జయిస్తే.. ఆ కుటుంబానికి అంతకు మించి కావాల్సింది ఏముంటుంది..? నిజంగా ఇది సాధ్యమై.. క్యాన్సర్‌ను జయించిన తమ బిడ్డను ఆ తల్లిదండ్రులు హత్తుకొని, ప్రేమగా ఓ ముద్దు పెడితే.. ఊహించుకుంటేనే మనసు ఆనందంతో నిండిపోతుంది కదా. ఈ ఊహ నిజం కావాలని ఆశిద్దాం.. ఆ తండ్రి తపన మోదీ, పుతిన్‌లను కదిలించాలని కోరుకుందాం..!!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa