బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇండియా కూటమి మాత్రం ఘోర పరాభవం మూటగట్టుకుంది. అతిపెద్ద పార్టీగా నిలుస్తుందనుకున్న రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)కు నిరాశ ఎదురైంది. అయితే ఈ ఓటమి తర్వాత తీవ్ర నిరాశలో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలోలో.. విభేదాలు ముదిరాయి. తాజాగా లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య.. తేజస్వీ యాదవ్పై తీవ్ర ఆరోపణలు చేసింది. అంతేకాకుండా తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్కు కిడ్నీ దానం చేసి తప్పు చేసినట్లు.. మహిళలు ఇలాంటి తప్పులు చేయొద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు.
బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. తాను ఆర్జేడీ పార్టీ నుంచి, కుటుంబం నుంచి బయటకు వచ్చేసినట్లు శనివారం ప్రకటించారు లాలూ కుమార్తె రోహిణి ఆచార్య. తాజాగా తన తమ్ముడు తేజస్వీ యాదవ్పై సంచలన ఆరోపణలు చేశారు. తేజస్వీ, ఆయన అనుచరులు తనను కుటుంబం నుంచి బయటకు పంపించినట్లు ఆరోపించారు. తనను దూషించారని, చెప్పులతో కొట్టబోయారని సషల్ మీడియాలో భావోద్వేగ పోస్టులు పెట్టారు.
"నిన్న ఓ కుమార్తె, సోదరి, గృహిణి, తల్లి అవమానానికి గురైంది. నన్ను దూషించారు. చెప్పులతో కొట్టబోయారు. అయినా.. నేను నా ఆత్మగౌరవం విషయంలో రాజీపడలేదు. నిజాన్ని వాళ్ల ముందు లొంగనీయలేదు. అందుకే నేను ఈ అవమానం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏడుస్తున్న సోదరిని, తల్లిదండ్రులను విడిచి.. ఓ కూతురు నిస్సహాయతతో వెళ్లింది. నా పుట్టింటిని వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. వాళ్లు నన్ను అనాథను చేశారు. మీరు (మహిళలు) ఎప్పటికీ నా మార్గంలో నడవొదద్దు. ఏ కుటుంబానికి రోహిణి వంటి కుమార్తె, సోదరి ఉండకూడదని కోరుకుంటున్నాను" అని ఆవేదన వ్యక్తం చేశారు.
2022లో లాలూ ప్రసాద్ యాదవ్కు కిడ్నీ మార్పిడి చికిత్స జరిగింది. లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తన కిడ్నీని దానం చేశారు. ఆ సమయంలో రోహిణిపై చాలా మంది వివిధ పార్టీల నేతలు ప్రశంసల వర్షం కురిపించారు. బీజేపీ నేత, గొడ్డా ఎంపీ నిషికాంత్ దూబే.. 'దేవుడు నాకు కుమార్తెను ఇవ్వలేదు.. ఈరోజు రోహిణి ఆచార్యను చూస్తుంటే నిజంగా దేవుడితో పోరాడాలనిపిస్తోంది' అంటూ ట్వీట్ చేశారు. తాజాగా ఈ కిడ్నీ విషయంపై పలు వ్యాఖ్యలు చేశారు.
మరో సోషల్ మీడియా పోస్టులో.. "నిన్న నన్ను డర్టీ అని తిట్టారు. నాది డర్టీ కిడ్నీ అన్నారు. కిడ్నీ ఇచ్చినందుకు.. రూ. కోట్లు, టికెట్లు తీసుకున్నానని ఆరోపించారు. పెళ్లైన కూతుళ్లు, సోదరీమణులకు ఓ విషయం చెబుతున్నా.. మీ పుట్టింట్లో కుమారుడు లేదా అన్నయ్య ఉంటే పొరబాటున కూడా దేవుడు వంటి మీ తండ్రిని కాపాడకండి. ఆ ఇంటి కొడుకు అయిన మీ అన్నయ్యో లేదా అతడి హర్యానా స్నేహితుడినో.. కిడ్నీని ఇవ్వాలని చెప్పండి. మీరు మీ కుటుంబాలు, తల్లిదండ్రులు, మీ పిల్లలు, అత్తమామలను చూసుకోండి. కేవలం మీ గురించి మాత్రమే ఆలోచించండి. నా నుంచి చాలా పెద్ద తప్పు జరిగింది. నేను నా భర్త, అత్త కుటుంబం గురించి ఆలోచించకుండా.. తండ్రిని కాపాడుకొనేందుకు ఆ పనిచేశా. కానీ ఇప్పుడు డర్టీ అని మాటలు పడాల్సివస్తోంది. మీరంతా నాలాంటి తప్పు ఎప్పటికీ చేయకూడదు" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa