సాంకేతిక పురోగతితో ప్రపంచం దూసుకుపోతున్నా.. భారత్లోని కొన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకాలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. చాలా మంది అంధ విశ్వాసాలతో.. వారు నష్టపోవడమే కాకుండా.. ఎదుటి వారికి కీడు తలపెడుతున్నారు. నిత్యం ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్లో ఇలాంటి దారుణ ఘటన చోటుచేసుకుంది. వయసు మీరిపోతున్నా ఇంకా పెళ్లి కావట్లేదని నలుగురు యువతులు ఆటవిక చర్యకు పాల్పడ్డారు. 17 రోజుల వయసున్న పసికందును.. క్షుద్ర పూజలకు బలిచ్చారు. ఇలా చేస్తే తమకు పెళ్లి అవుతుందని ఈ దారుణానికి ఒడగట్టారు. చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జోధ్పూర్లోని నెహ్రూ నగర్ కాలనీలో నలుగురు యువతులు నివసిస్తున్నారు. వీరి సోదరికి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాజాగా మళ్లీ డెలివరీ అయింది. అయితే ఈ నలుగురికి మాత్రం వయసు మీరిపోతున్నా ఇంకా పెళ్లి కాలేదు. గత కొన్నేళ్ల నుంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఈ నలుగురు అక్కాచెల్లెళ్లలో అసహనం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో నెలన్నర రోజుల కింద డెలివరీ కోసం.. గుజరవాస్కు చెందిన వారి సోదరి సుమన్ పుట్టింటికి వచ్చింది. 17 రోజుల క్రితం ఓ బిడ్డకు జన్మనిచ్చింది.
ఆ బిడ్డను భెరు దేవుడికి బలి ఇస్తే తమకు పెళ్లి అవుతుందని నలుగురు అక్కాచెళ్లెళ్లు భావించారు. ఈ క్రమలో శుక్రవారం (నవంబర్ 14) తమ సోదరి బాత్రూమ్కు వెళ్లిన సమయంలో.. ఈ నలుగురు బాలుడ్ని తమ రూమ్లోకి తీసుకెళ్లారు. అనంతరం పిల్లాడు నోరు నొక్కి, కాళ్లు చేతులు విరిచేసి చంపేశారు. తర్వాత క్షుద్ర పూజలు మొదలుపెట్టారు. ఓ మహిళ తన ఒడిలో బాబు శవాన్ని పెట్టుకుని మంత్రాలను చదువుతూ ఉంటే.. మిగిలిన వాళ్లు కింద కూర్చుని మంత్రాలు చదివారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ సంఘటనపై బాలుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటన జరిగిన రోజు తెల్లవారు జామున 3.30 గంటలకు తన భార్య కాల్ చేసి.. తన సిస్టర్స్ ఈ విషయం చెప్పిందని తెలిపాడు. 'నా భార్య ఈ విషయం చెప్పినప్పుడు.. మొదటగా రాత్రి సమయంలో పిల్లాడు కింద పడ్డాడేమో అనుకున్నాను. కానీ వాళ్లు.. కాళ్లు, చేతులు విరిచేసి చంపేశారని తర్వాత తెలిసింది. ఆ నలుగురికి తన సోదరి అంటే అసూయ. ఆమెకు పెళ్లై ఇప్పటికే ఇద్దరు పిల్లు ఉన్నారు. వారికి ఇంకా పెళ్లి కాకపోయే సరికి అసహనానికి గురయ్యారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి' అని బాలుడి తండ్రి డిమాండ్ చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు అక్కాచెల్లెళ్లను అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa