ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ పేలుడుకు ‘మదర్ ఆఫ్ సైతాను’ వినియోగం..! ఇది అత్యంత ప్రమాదకారా

national |  Suryaa Desk  | Published : Sun, Nov 16, 2025, 08:52 PM

దేశ రాజధాని ఢిల్లీలో గతవారం సంభవించిన పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. విచారణలో సంచలన వాస్తవాలు బయటపడుతున్నాయి. తాజాగా, ఈ పేలుడుకు ట్రైఎసిటోన్ ట్రై పెరోక్సైడ్ అనే రసాయనాన్ని ఉయోగించినట్టు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ‘ మదర్ ఆఫ్ సైతాన్ ’గా గుర్తింపు పొందిన ఈ రసాయనం డెటోనేటర్ లేకుండానే వేడి కారణంగా పేలిపోయే గుణం కలిగి ఉంటుందని నిపుణులు తెలిపారు. ఢిల్లీ పేలుడుకు ఇదే కారణమైందా? అనేది ఫోరెన్సిక్ నిపుణులు ప్రస్తుతం పరీక్షిస్తున్నారు.


నవంబరు 10న సాయంత్రం ఎర్రకోట వద్ద i20 కారులో పేలుడు సంభవించి 13 మంది చనిపోగా.. మరో 20 మంది వరకు గాయపడ్డారు. ఆ కారును నడిపిన డాక్టర్ ఉమర్ మహ్మద్ నబీకి.. పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. దర్యాప్తు బృందాల ప్రకారం.. టీఏటీపీ ప్రమాద తీవ్రత గురించి అవగాహన ఉండటంతో నిందితుడు ఉమర్ జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతంలోకి కారును నడిపించాడు. పేలుడు జరిగిన ప్రదేశంలో పాత ఢిల్లీలో అత్యంత రద్దీగా ఉండే చాందీనీ చౌక్‌‌కు కేవలం కొన్ని అడుగుల దూరంలోనే ఉంది.


ఇక, ట్రైఎసిటోన్ ట్రై పెరోక్సైడ్ (టీఏటీపీ) అత్యంత సున్నితమైందని నిపుణులు పేర్కొంటున్నారు. ఘర్షణ, ఒత్తిడి, ఉష్ణోగ్రత పెరగడం వంటి భౌతిక పరిసరాల్లో ఏ చిన్న మార్పైనా పేలుడుకు దారితీస్తుంది. రసాయనికంగా, ఉష్ణస్థితిగతంగా స్థిరంగా ఉండే అమోనియం నైట్రేట్‌కు మాత్రం డెటోనేటర్ అవసరం పడుతుంది, కానీ TATP‌కు అలాంటి అవసరం ఉండదు.


ప్రపంచవవ్యాప్తంగా నిషేధిత బాంబుల తయారీకి విస్తృతంగా ఉపయోగించడం వల్ల దీనిని ‘మదర్ ఆఫ్ సైతాన్’‌గా పేర్కొంటారు. 2017 బార్సిలోనా, 2015 పారిస్ దాడులు, 2017 మాంచెస్టర్, 2016 బ్రస్సెల్స్ పేలుళ్లలోనూ ఈ సంయోగ పదార్థం ఆనవాళ్లు లభ్యమయ్యాయి. ఇటువంటి పేలుడు పదార్థాలను తయారు చేసిన వ్యక్తులు ఏదో రూపంలో ఉగ్రవాద శిక్షణ పొందినవారే అని నమ్ముతుంటారు.


ఢిల్లీలో సంఘటనా స్థలిలో ధ్వంసమైన తీరును పరిశీలిస్తే టీఏటీపీ‌కు సాధారణంగా కనిపించే లక్షణాలకు అనుగుణంగా ఉన్నాయి. శక్తివంతమైన ప్రకంపనలకు ప్రసిద్ధి చెందిన ఈ రసాయనం ఇలాంటి విధ్వంసాన్ని సృష్టించగలదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలిలో నమూనాలను సేకరించిన ఫోరెన్సిక్ బృందాలు టీఏటీపీ ఉపయోగించారా? అనేది నిర్ధారించే పనిలో ఉన్నాయి. పేలుడు తీవ్రతను బట్టి చూస్తే కారు లోపల ఉష్ణోగ్రత లేదా అస్థిర వాతావరణం కారణమై ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంకా భారీ ఉగ్రదాడుల కోసం తరలిస్తున్న సమయంలో అది అనుకోకుండా పేలిపోయిందా? అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది.


టీఏటీపీ తయారీకి అవసరమైన రసాయనాలను నిందితుడు ఉమర్ ఎలా సంపాదించాడు అనే విషయంపై దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే దీని తయారికి పలురకాల రసాయనాలు అవసరం అవుతాయి. ఏదైనా విస్తృత నెట్‌వర్క్ నుంచి అతడికి సహాయం లభించిందా లేదా ఈ పేలుడు పదార్థాన్ని సిద్ధం చేయడంలో మరెవరైనా పాల్గొన్నారా? అనేది కూడా విచారిస్తున్నారు. పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు పేలుడుకు ముందు నిందితుడు ఉమర్ డిజిటల్ కార్యకలాపాలు, ప్రయాణ వివరాలు, కమ్యూనికేషన్ రికార్డులను పరిశీలించి అతని కార్యకలాపాల పూర్తి మ్యాప్‌ రూపొందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa