ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పొలిటికల్ ఎంట్రీపై వంగవీటి రంగా కుమార్తె ఆసక్తికర వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 16, 2025, 09:00 PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర రాజకీయాల్లోకి మరో వారసురాలు ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం అయ్యిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇంతకు ఆ వారసురాలు ఎవరంటే వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ . నేడు ఆదివారం ఆశా కిరణ్.. విజయవాడ, బందరు రోడ్డులో ఉన్న వంగవీటి రంగా విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆశాకిరణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. ఇంతకు ఆశా కిరణ్ ఏమన్నారంటే..


వంగవీటి రంగా కుమార్తె.. ఆషా కిరణ్ నేడు(ఆదివారం) విజయవాడ బందరు రోడ్డులో ఉన్న ఆమె తండ్రి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇక మీదట తాను రంగా ఆశయ సాధన కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత కొంత కాలంగా ప్రజా జీవితానికి దూరంగా ఉన్నానని.. ఇకపై తన పూర్తి ప్రయాణం ప్రజలతోనే అని ఆశా కిరణ్ స్పష్టం చేశారు. ఇకపై విజయవాడ ప్రజలకు ఏ కష్టం వచ్చినా.. తాను వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.


రాధా, రంగా మిత్రా మండలిల మధ్య కొంత గ్యాప్ ఉందని ఆశా కిరణ్ చెప్పుకొచ్చారు. ఆ ఖాళీని పూర్తి చేయడానికే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ప్రస్తుతం ఏ పార్టీలోకి వెళ్లాలి అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆశా కిరణ్ తెలిపారు. వంగవీటి రంగా, రాధా.. కులం, ప్రాంతం, మతంతో సంబంధం లేకుండా.. సాయం కోరి వచ్చిన వారందరిని ఆదుకున్నారని ఆమె గుర్తు చేశారు. తాను కూడా వారి మార్గంలోనే నడుస్తానని స్పష్టం చేశారు.


ఆశా కిరణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆశ రాజకీయాల్లోకి వస్తే.. ఆమె ఏ పార్టీలో చేరతారనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే రంగా మరణం తర్వాత ఆయన భార్య రత్నకుమారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ కొన్నాళ్ల తర్వాత విబేధాల వల్ల పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు.


ప్రస్తుతం రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ముందుగా ఆయన 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం నుంచి, 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో అంత చురుగ్గా లేరు. ప్రస్తుతం ఆయన విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఆశా కిరణ్ రాజకీయాల్లోకి వస్తాను అనడం ఆసక్తికరంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa