ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కైలాసగిరిలో 50 అంతస్తుల ఐకానిక్‌ భవనం,,,,కొత్తవలసలో 120 ఎకరాల్లో థీమ్ సిటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 16, 2025, 09:13 PM

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు చర్యలు తీసుకుంటుంది. ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తూనే.. పరిశ్రమల ఏర్పాటు, ఇతర రంగాల అభివృద్ధికి పాటుపడుతోంది. ఈక్రమంలో పర్యాటక రంగానికి పెద్ద పీట వీస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని ఆ ప్రాంతంలో 50 అంతస్తుల ఐకానిక్ బిల్డింగ్, 120 ఎకరాల్లో థీమ్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు..


ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కైలాసగిరిలో 50 అంతస్తుల ఐకానిక్ బిల్డింగ్ నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. తాజాగా మంత్రి నారాయణ విశాఖపట్నంలో చేపట్టిన అభివృద్ధి పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి నారాయణ కీలక ఆదేశాలు జారీ చేశారు. అలానే విశాఖలో కూటమి ప్రభుత్వం ప్రారంభించిన పలు కీలక ప్రాజెక్టుల పురోగతిపై అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.


భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు అనుసంధానంగా నిర్మిస్తోన్న మాస్టర్‌ప్లాన్ రోడ్ల పనులపై మంత్రి నారాయణ అధికారులను అడిగి పురోగతిని తెలుసుకున్నారు. మిగిలిన పనులను మరో ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని నారాయణ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమైన ప్రాజెక్టుల పురోగతికి సంబంధించి అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు.


విశాఖపట్నం నగరం అభివృద్ధిలో భాగంగా వీఎంఆర్‌డీఏ చేపట్టిన 8 ఎంఐజీ ప్రాజెక్టులతో పాటు రహదారులు, డ్రెయిన్లు, ఇతర మౌలిక వసతుల పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని.. ఈ పనులను వేగవంతం చేయాలని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. వైజాగ్ నగరానికి ఐకాన్‌గా నిలిచేలా కైలాసగిరిపై 50 అంతస్తుల ఐకానిక్ భవనం నిర్మించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. అలానే కొత్తవలస వద్ద 120 ఎకరాల విస్తీర్ణంలో ఒక థీమ్ బేస్డ్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.


రాష్ట్రంలో పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు గాను కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపిన నారాయణ.. వేగంగా టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రకటించారు. అలానే వచ్చే సంవత్సరం జూన్ నెలాఖరు నాటికి లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. విశాఖ మాస్టర్‌ప్లాన్ డిజైన్‌ను కూడా నిర్దేశించిన గడువులోగా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. వైజాగ్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా డెవలప్ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం విశాఖలో 11 అంతస్తుల ఐకానిక్ బిల్డింగ్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ బిల్డింగ్‌ని ఐటీ కంపెనీల కోసం కేటాయించన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa