రాయలసీమ అభివృద్దిపై చంద్రబాబుకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పెద్ద మనుషుల రాసుకున్న శ్రీబాగ్ ఒడంబడికను ఇప్పటికైనా అమలు చేసి వెనుబాటుతనానికి గురైన రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేయాలని మాజీ మంత్రి సాకె శైలజానాథ్ డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రుల ఐక్యత కోసం రాయలసీమ వాసులు చారిత్రక, వారసత్వ సంపద, సంస్కృతిని కోల్పోయరని.. దేశం కోసం రాయలసీమలో 40 శాతం భూభాగాన్ని త్యాగం చేశామని చెప్పారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమ ప్రాంతానికి హక్కుగా దక్కాల్సిన హైకోర్టు, ఎయిమ్స్ ను అమరావతికి తరలించిన చంద్రబాబు రాయలసీమకి చెడ్డ బిడ్డగా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా రాయలసీమ ప్రాంతానికి నష్టమే తప్ప ఒరిగిందేమీ లేదని స్పష్టం చేశారు. దివంగత మహానేత వైయస్ఆర్, మాజీ సీఎం వైయస్ జగన్లు మాత్రమే రాయలసీమ స్థితిగతులను పూర్తిగా అర్థం చేసుకుని సాగునీటి ప్రాజెక్టులపై దృష్టిసారించారని సాకె వివరించారు. హంద్రీనీవా ప్రాజెక్టును 5 టీఎంసీలకే పరిమితం చేసి చంద్రబాబు తాగునీటి ప్రాజెక్టుగా చేస్తే, ఆ తర్వాత ముఖ్యమంత్రులుగా చేసిన వైయస్ఆర్, వైయస్ జగన్లు 50 టీఎంసీలకు పెంచి రాయలసీమ ప్రాంతానికి సాగునీటి అవసరాలను చాలా వరకు తీర్చారని వివరించారు. ఇకపై రాయలసీమ ప్రాంతానికి నష్టం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని కూటమి ప్రభుత్వాన్ని మాజీ మంత్రి సాకె శైలజానాథ్ హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa