ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవంబర్ 19న అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల జమ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 17, 2025, 07:27 PM

ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు శుభవార్త. అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులు విడుదలపై క్లారిటీ వచ్చింది. నవంబర్ 19న అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం జమ చేయనుంది. వైఎస్సార్ కడప జిల్లా కమలాపురంలో జరిగే కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత డబ్బులు విడుదల చేస్తారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ యోజన తో కలిపి ఈ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పీఎం కిసాన్ యోజన 21వ విడత నిధులు నవంబర్ 19న ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు.


ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు సైతం అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు ఆ రోజే విడుదల చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.5 వేలకు.. కేంద్ర ప్రభుత్వం అందించే రూ.2 వేలు కలిపి.. మొత్తం రూ.7 వేల రూపాయలను రైతుల బ్యాంక్ ఖాతాల్లో నవంబర్ 19న జమ చేయనున్నారు. ఆగస్ట్ నెల ప్రారంభంలో మొదటి విడత నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే.


మరోవైపు 46 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో అన్నదాత సుఖీభవ డబ్బులు జమ చేయనున్నారు. ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం రైతులు https://annadathasukhibhava.ap.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. ఇందులో Know Your Status అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఆధార్ కార్డు నంబర్ వివరాలు అడుగుతుంది. ఆధార్ కార్డు నంబరు ఎంటర్, కాప్చా నమోదు చేసిన తర్వాత.. ఆ పక్కనే ఉన్న సెర్చ్ బటన్ నొక్కాలి.


అనంతరం అర్హుల వివరాలు కనిపిస్తాయి. రైతు పేరుతో పాటుగా జిల్లా, మండలం, గ్రామం వివరాలు తెలుస్తాయి. అలాగే పథకం స్టేటస్ తెలుస్తుంది. ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి అయ్యిందా, చేయించుకోవాలా అనే వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి. వీటితో పాటుగా అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులు పడ్డాయా లేదా అనే వివరాలతో పాటుగా ఏ బ్యాంక్ అకౌంట్లోకి పడ్డాయనే వివరాలు కూడా తెలిసేలా అధికారులు అవకాశం కల్పించారు. మరోవైపు పీఎం కిసాన్ యోజనతో కలిసి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తొలివిడత రూ.7000, రెండో విడత రూ.7000, మూడో విడత కింద రూ.6000 అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa