ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌పై భారీ ఉగ్ర కుట్ర 'డీ6 మిషన్'.. 'మేడమ్ సర్జన్' ప్లాన్

national |  Suryaa Desk  | Published : Mon, Nov 17, 2025, 08:44 PM

ఢిల్లీ ఎర్రకోట ఉగ్రదాడిలో దర్యాప్తు జరుగుతున్నా కొద్దీ సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన వారిని అధికారులు విచారిస్తున్నారు. భారత్‌లో ఉగ్ర కార్యకలాపాల్లో డాక్టర్ ముజమ్మిల్, ఉమర్, డాక్టర్ షహీన్ షాహిద్ కీలకంగా వ్యవరించినట్లు ఇప్పటికే బయటకు వచ్చింది. ప్రస్తుతం వీరు పోలీసుల కస్టడీలో ఉన్నారు. అయితే తాజాగా ' మేడమ్ సర్జన్ ', 'మిషన్ డీ-6 ' వంటి పదాలు వెలుగులోకి వచ్చాయి. జైషే మహ్మద్ వంటి ఉగ్రసంస్థలతో సంబంధమున్న 43 ఏళ్ల షాహిన్ షాహిద్‌ను.. ‘మేడమ్ సర్జన్‌’ అనే కోడ్‌నేమ్‌తో పిలిచేవారని తెలుస్తోంది. ఈమె ఉగ్ర నెట్‌వర్క్‌కు కీలకంగా వ్యవహరించినట్లు అధికారులు తెలిపారు.


డీ-6 మిషన్ ఇదే..


ఈ ఉగ్ర నెట్‌వర్క్‌.. భారత్‌లోని 6 ప్రధాన నగరాలపై దాడులు చేయాలని.. 'డీ-6 మిషన్‌'కు ప్లాన్ చేసిందని విచారణలో భాగంగా అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఏయే నగరాలపై దాడి చేయాలి, ఉగ్రవాదుల నియామక వ్యూహాలు, డబ్బు తరలింపు, రహస్య పద్ధతిలో ఇన్ఫర్‌మేషన్ షేర్ చేసుకోవడానికి వారు చేసిన ప్లాన్స్ బయటకు వస్తున్నాయి. ఫరీదాబాద్‌లో అరెస్టయిన షాహిన్‌.. డైరీలు, డిజిటల్‌ ఫైల్స్‌ ఇప్పుడు కీలకమైన ఆధారాలుగా మారాయి. డిసెంబరు 6న భారీ కుట్ర చేసేందుకు ఈ నెట్‌వర్క్‌ ప్లాన్‌ చేసినట్లు వాటిని బట్టి తెలుస్తోంది.


విచారణలో భాగంగా షాహిన్ షాహిద్‌ ఖాతాలను దర్యాప్తు అధికారులు ఆడిట్ చేస్తున్నారు. ఢిల్లీ, కాన్పూర్‌, లక్నోలో ఉన్న ఏడు బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తున్నారు. 2013లో షాహిన్ అనూహ్యంగా మిస్ అయ్యే వరకు.. GSVM మెడికల్ కాలేజ్‌లో పనిచేసింది. ఆ సమయంలో ఆమె ప్రవర్తన ఎలా ఉండేదనే దానిపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.


2010 నుంచి షాహీన్ మారిపోయింది..


GSVM కాలేజీ మాజీ ఉద్యోగి చెప్పిన వివరాల ప్రకారం.. 2010 నుంచి షాహిన్‌లో మార్పులు వచ్చాయి. ఓ ఎన్ఆర్ఐ డాక్టర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అతడు షాహిన్‌కు ర్యాడికల్ వీడియోలు, కవిత్వం పంపించేవాడు. తర్వాత ఆమె తీరులో మార్పు వచ్చింది. హిజాబ్ ధరించడం, విదేశాలకు వెళ్లాలనే కోరిక వెలిబుచ్చేది. అలా 2013లో షాహిన్ అదృశ్యం అయింది. 2015–2016 మధ్యకాలంలో ఆమెకు జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు సంబంధించిన వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి ఇతర నిందితులతో కలిసి.. భారత్‌పై దాడి చేయడానికి 2021లో ప్లానింగ్ మొదలు పెట్టింది.


2022లో భారీ ఉగ్రకుట్రకు హ్యాండ్లర్ గ్రీన్ సిగ్నల్..


ఉగ్ర ముఠాలోని సభ్యులు 2022లో మార్చిలో టర్కీకి వెళ్లారు. అక్కడ ఐఎస్ఐ హ్యాండ్లర్, జైషే మహ్మద్ విదేశీ కార్యకలాపాలను నిర్వహించే కీలక వ్యక్తి అబు ఉకాసా ను కలిశారు. అందులో భాగంగా డిసెంబర్ 6న భారత్‌లో కో-ఆర్డినేటెడ్ దాడులకు అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అప్పటినుంచి ఆ భారీ ఉగ్రకుట్ర అమలుపై నిందితులు పనిచేస్తున్నారు. దాడులకు కావాల్సిన ఆయుధాలు.. ప్లాన్ అమలు చేసే ఉగ్రవాదుల నియామకానికి, వారి వసతి, కమ్యూనికేషన్ డివైజ్‌లు కొనుగోలు చేయడం కోసం డబ్బులు సేకరించడం మొదలు పెట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa