ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల పరకామణి చోరీ కేసు.. టీటీడీ కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 18, 2025, 07:39 PM

తిరుమల పరకామణి చోరీ కేసు ఏపీ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. టీటీడీ మాజీ ఉద్యోగి సతీష్ కుమార్ మరణం తర్వాత.. ఈ కేసుకు సంబంధించి రోజుకో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. సతీష్ కుమార్‌ది హత్య అని పోలీసులు నిర్ధారించారు. సతీష్ కుమార్ హత్య కేసుపై విచారణ జరుపుతున్నారు. విచారణలో భాగంగా రెండుసార్లు సీన్ రీకన్‌స్ట్రక్షన్ కూడా నిర్వహించారు. తాజాగా పరకామణి చోరీ ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ ) కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం రోజున టీటీడీ పాలకమండలి భేటీ అయ్యింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే తిరుమల పరకామణి చోరీ ఘటనపైనా టీటీడీ ధర్మకర్తల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. పరకామణి చోరీ ఘటనపై పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానం చేసింది.


పరకామణి చోరీ ఘటనపై లోక్ అదాలత్‌లో రాజీ వెనుక ఉన్నవారిని కనిపెట్టేందుకు పరకామణి ఘటనపై విచారణ జరపాలంటూ పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేయాలని టీటీడీ పాలకమండలి తీర్మానం చేసింది. ఈ విషయానికి సంబంధించి గతంలో పెట్టిన కేసు పరిధి పరిమితంగా ఉందని భావిస్తున్న టీటీడీ.. తిరుమల పోలీస్ స్టేషన్‌లో మరోసారి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. మరోవైపు భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని కేసును నిష్పక్షపాతంగా విచారణ చేసి.. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి నివేదించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. పరకామణి చోరీ ఘటన వెనుక ఎంతటి వారున్నా క్రిమినల్ కేసులు మోదు చేయాలని.. సమగ్ర దర్యాప్తు చేయాలని తీర్మానించింది.


మరోవైపు అమరావతిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో రెండో ప్రాకారం నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన భూమి పూజలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. నవంబర్ 27వ తేదీన ఈ కార్యక్రమం చేపట్టాలని టీటీడీ నిర్ణయించింది. అలాగే డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకూ పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలని నిర్ణయించింది. ఈ పది రోజుల్లో 182 గంటల దర్శన సమయం ఉంటుంది. ఇందులో సామాన్య భక్తులకు 164 గంటలు కేటాయించాలని నిర్ణయించారు.


అలాగే మొదటి మూడు రోజులు శ్రీవాణి దర్శనాలను, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు ర‌ద్దు చేయాలని టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ పది రోజులు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేశారు. ప్రివిలేజ్ దర్శనాలు రద్దుచేసినట్లు టీటీడీ తెలిపింది. ఆలయానికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా సిఫార్సు లేఖలు స్వీకరించమని టీటీడీ వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa