వెనిజులాలో అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న తీరుకు నిదర్శనంగా ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. మార్గి ఒరోజ్కో అనే 65 ఏళ్ల మహిళా వైద్యురాలు.. ఇటీవలే వాట్సాప్ ద్వారా ప్రభుత్వాన్ని విమర్శించింది. మదులో సర్కారును తిడుతూ.. ఆడియో మెసేజీ పంపినందుకు గాను కోర్టు ఆమెకు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఒక్క మెసేజీతో ఇంత పెద్ద శిక్ష పడడంతో ఈ విషయం కాస్తా అంతర్జాతీయంగా సంచలనంగా మారింది.
అసలేం జరిగిందంటే..?
డా. మార్గి ఒరోజ్కో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సందేశం పంపారని ఆమెపై కమ్యూనిటీ నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై రాజద్రోహం, విద్వేషాన్ని ప్రేరేపించడం, కుట్రకు పాల్పడటం వంటి తీవ్ర అభియోగాలను మోపుతూ కేసు నమోదు చేశారు. ఈ అభియోగాలను నిర్ధారిస్తూ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. అయితే డాక్టర్ ఒరోజ్కో ఏ విధమైన సందేశాన్ని, ఎవరికి పంపారు అనే వివరాలను ప్రభుత్వం గానీ, కోర్టు గానీ స్పష్టంగా వెల్లడించలేదు. కానీ ఆమె చేసిన తప్పుకు గాను 30 ఏళ్ల జైలుశిక్ష విధిస్తున్నట్లు వెల్లడించింది.
ఈ సంఘటన 2024 జూలైలో నికోలస్ మదురో మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత చోటుచేసుకుంది. ఆ ఎన్నికల కౌంటింగ్లో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ ఫలితాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ నిరసనల్లో భాగంగానే సాన్ జువాన్ డి కోలన్ పట్టణంలో నివసించే డాక్టర్ ఒరోజ్కోను ఆగస్టు నెలలో పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతోపాటు దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు అరెస్టు అయినప్పటికీ.. వారిలో చాలా మంది కొద్ది నెలల వ్యవధిలో విడుదల అయ్యారు. కానీ డాక్టర్ ఒరోజ్కో మాత్రం జైలులోనే ఉండిపోయారు.
జేఈపీ అనే మానవ హక్కుల ఎన్జీవో తెలిపిన వివరాల ప్రకారం.. డా. ఒరోజ్కో నిర్బంధంలో ఉన్న సమయంలో ఆమెకు రెండుసార్లు గుండెపోటు వచ్చిందని వెల్లడించింది. వృద్ధాప్యం, ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ.. ప్రభుత్వం ఆమె పట్ల వ్యవహరించిన తీరుపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం 882 మంది రాజకీయ ఖైదీలు వెనిజులా జైళ్లలో మగ్గిపోతున్నారని, మదురో ప్రభుత్వం తమపై వచ్చే విమర్శలను కఠినంగా అణచివేస్తోందని జేఈపీ ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం ఒక వాట్సాప్ మెసేజ్ కారణంగా ఒక వృద్ధురాలైన డాక్టర్కు జీవిత ఖైదు విధించడం, మదురో పాలనలో అసమ్మతికి స్థానం లేదనే సందేశాన్ని స్పష్టంగా తెలుపుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa