ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అదానీ విల్మర్ నుంచి పూర్తిగా బయటకు వచ్చిన అదానీ గ్రూప్

business |  Suryaa Desk  | Published : Sat, Nov 22, 2025, 11:57 AM

పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (FMCG) రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న 'అదానీ విల్మర్ లిమిటెడ్' నుంచి పూర్తిగా వైదొలిగింది. ఈ సంస్థలో తమకు మిగిలిన 7 శాతం వాటాను కూడా శుక్రవారం బ్లాక్ డీల్ ద్వారా విక్రయించింది.ఈ వాటాల కొనుగోలుకు దేశీయ, అంతర్జాతీయ సంస్థాగత మదుపరుల నుంచి భారీ డిమాండ్ లభించినట్లు తెలుస్తోంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్, టాటా మ్యూచువల్ ఫండ్ వంటి దేశీయ సంస్థలతో పాటు యూఏఈ, సింగపూర్ మార్కెట్లకు చెందిన అంతర్జాతీయ ఇన్వెస్టర్లు కూడా ఈ డీల్‌లో పాల్గొన్నట్లు సమాచారం.అదానీ విల్మర్ అనేది అదానీ గ్రూప్, సింగపూర్‌కు చెందిన విల్మర్ ఇంటర్నేషనల్ మధ్య ఏర్పాటైన జాయింట్ వెంచర్. ఇందులో అదానీ గ్రూప్‌కు తొలుత 44 శాతం వాటా ఉండేది. ఈ వారం ప్రారంభంలో 13 శాతం వాటాను విక్రయించిన అదానీ గ్రూప్, తాజాగా మిగిలిన వాటాను కూడా అమ్మేసింది. ఈ మొత్తం వాటా విక్రయం ద్వారా అదానీ గ్రూప్‌కు సుమారు రూ. 15 వేల కోట్లకు పైగా నిధులు సమకూరినట్లు అంచనా.తాజా పరిణామాలతో అదానీ విల్మర్‌లో 57 శాతం వాటాతో విల్మర్ ఇంటర్నేషనల్ ఏకైక ప్రమోటర్‌గా నిలిచింది. వంట నూనెలు, గోధుమ పిండి, బియ్యం, చక్కెర వంటి నిత్యావసరాలను ఈ సంస్థ విక్రయిస్తోంది. కాగా, ఈ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం సెషన్‌లో అదానీ విల్మర్ షేరు ధర ఒక శాతానికి పైగా నష్టపోయి రూ. 273.60 వద్ద స్థిరపడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa