విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక శుభవార్త అందించనుంది. అత్యవసర కారణాలతో ప్రయాణానికి కొన్ని గంటల ముందు టికెట్ రద్దు చేసుకున్నా, ఇకపై టికెట్ మొత్తంలో సింహభాగం వెనక్కి రానుంది. విమాన టికెట్లోనే అంతర్లీనంగా ట్రావెల్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టడం ద్వారా, చివరి నిమిషంలో టికెట్ రద్దు చేసుకున్నా 80 శాతం వరకు రీఫండ్ పొందేలా కొత్త విధానాన్ని తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. రానున్న 2-3 నెలల్లో ఈ విధానాన్ని అమలు చేసేందుకు పౌర విమానయాన శాఖ కసరత్తు చేస్తోంది.ప్రస్తుతం విమానం బయలుదేరడానికి మూడు గంటల ముందు టికెట్ రద్దు చేస్తే, దాన్ని 'నో-షో'గా పరిగణించి ఎలాంటి రీఫండ్ ఇవ్వడం లేదు. వైద్యపరమైన అత్యవసర పరిస్థితులను నిరూపిస్తే కొన్ని సందర్భాల్లో మాత్రమే విమానయాన సంస్థలు తమ విచక్షణ మేరకు రీఫండ్ ఇస్తున్నాయి. ఈ ఇబ్బందులను తొలగించేందుకు పౌర విమానయాన శాఖ కార్యదర్శి దేశీయ విమానయాన సంస్థలతో చర్చిస్తున్నారు. ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం భారాన్ని ప్రయాణికులపై మోపకుండా, విమానయాన సంస్థలే భరించేలా ఒప్పందాలు చేసుకోనున్నారు.ఈ విధానంపై ఇప్పటికే ఓ ప్రముఖ విమానయాన సంస్థ ఇన్సూరెన్స్ కంపెనీలతో చర్చలు ప్రారంభించింది. తక్కువ ధరల కేటగిరీ టికెట్లలోనూ ఈ ఇన్సూరెన్స్ జోడించడం ద్వారా ప్రయాణికులకు కొంతైనా రీఫండ్ దక్కేలా చూడాలని భావిస్తున్నాంఅని ఆ సంస్థ అధికారి ఒకరు తెలిపారు. టికెట్ రద్దు చేసుకుంటే డబ్బులు వస్తాయో, రావో అనే భయంతో చాలా మంది ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. ఈ అనిశ్చితిని తొలగించి, రీఫండ్ ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.మరోవైపు, టికెట్ల రీఫండ్ విషయంలో ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా రంగంలోకి దిగింది. రీఫండ్ నిబంధనలను ప్రయాణికులకు మరింత అనుకూలంగా మార్చేందుకు ప్రస్తుత నిబంధనలను సవరించే ప్రక్రియను ప్రారంభించింది. ప్రభుత్వం విమానయాన సంస్థల వాణిజ్య వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలనుకోవడం లేదని, కానీ ప్రయాణికుల ప్రయోజనాలను కాపాడటానికి కనీస ప్రమాణాలను నిర్దేశించడం అవసరమని డీజీసీఏ ముసాయిదా నిబంధనలలో పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa