దేశంలో రవాణా సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పన రోజురోజుకూ శరవేగంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలు, ఎక్స్ప్రెస్వేలు, హైస్పీడ్ కారిడార్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా వేలాది కిలోమీటర్ల కొత్త రోడ్లను నిర్మించడమే కాకుండా.. ఉన్న రోడ్లను విస్తరించే ప్రణాళికలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ రాష్ట్రాల్లో కీలక మార్గాల్లో రోడ్లు వేస్తున్నాయి. తాజాగా ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో మరో కీలక మార్గం నిర్మిస్తుండగా.. అది తుది దశకు చేరుకుంది. త్వరలోనే దీన్ని ప్రారంభించి.. మరిత మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలని ఉత్తర్ప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చూస్తోంది.
యోగి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 594 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్ప్రెస్ వే (మీరట్ నుంచి ప్రయాగ్రాజ్ వరకు) వచ్చే ఏడాది ప్రారంభంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఎక్స్ప్రెస్వేను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడానికి.. ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం స్విట్జర్లాండ్కు చెందిన ఈటీహెచ్ జూరిచ్ యూనివర్సిటీ, ఆర్టీడీటీ లాబొరేటరీస్ ఏజీతో ఒప్పందం కుదుర్చుకుంది. వీరి సహకారం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సెన్సార్ టెక్నాలజీని ఉపయోగించి.. ఎక్స్ప్రెస్వే నిర్మాణ నాణ్యతను రియల్ టైమ్లో పర్యవేక్షించనున్నారు.
ఈ ఎక్స్ప్రెస్వేపై వాహనాల ప్రయాణ నాణ్యతను పెంచడంతోపాటు.. దీని వెంబడి పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేసి.. రాష్ట్రానికి ఆర్థికంగా ఇంజిన్గా మార్చాలని యోగి సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏఐ టెక్నాలజీతో.. ఎక్స్ప్రెస్వే నిర్మాణ సమయంలోనే లోపాలు ఉంటే గుర్తిస్తాయి. దీనివల్ల ఆ లోపాలను వెంటనే సవరించేందుకు ఇంజనీర్లకు సహాయపడుతుంది. ఈ స్విస్ టెక్నాలజీ ప్రయాణ నాణ్యత, సౌకర్యాన్ని కల్పిస్తుందని యూపీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
594 కిలోమీటర్లు ఈ భారీ ఎక్స్ప్రెస్వే యూపీలోని 12 జిల్లాలను కలుపుతూ నిర్మిస్తున్నారు. మీరట్ నుంచి మొదలుకుని.. హాపూర్, బులంద్షహర్, అమ్రోహా, సంభాల్, బదౌన్, షాజహాన్పూర్, హర్దోయ్, ఉన్నావ్, రాయ్బరేలీ, ప్రతాప్గఢ్ మీదుగా ప్రయాగ్రాజ్ వరకు దీన్ని నిర్మిస్తున్నారు. ఈ ఎక్స్ప్రెస్ వే 140 నదులు, కుంటలు, కాలువలను దాటుతుంది. ఇక ఈ మొత్తం మార్గంలో 7 ఓవర్బ్రిడ్జ్లు, 17 ఇంటర్ఛేంజ్లు, 14 మెయిన్ బ్రిడ్జిలు, 126 చిన్న బ్రిడ్జిలు, 28 ఫ్లైఓవర్లు, 50 అండర్పాస్లు, 946 కల్వర్టులు సహా అనేక నిర్మాణాలు ఉన్నాయి.
ఇక ఈ గంగా ఎక్స్ప్రెస్వే విజయవంతంగా పూర్తి అయి.. వాహనదారులకు అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఇదే అధునాతన ఏఐ టెక్నాలజీ వ్యవస్థను 91.35 కిలోమీటర్ల గోరఖ్పూర్ లింక్ ఎక్స్ప్రెస్వేలో కూడా ఉపయోగించనున్నారు. ఈ గంగా ఎక్స్ప్రెస్వే వెంబడి, రాష్ట్రంలోని ఇతర ప్రధాన ఎక్స్ప్రెస్వేల వెంబడి పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేయడానికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa