ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్తాన్ ఆర్మీ అధికారి అసభ్య ప్రవర్తన,,,,మీడియా సమావేశంలో పాడు పనులు

international |  Suryaa Desk  | Published : Wed, Dec 10, 2025, 09:37 PM

పాకిస్తాన్ ఆర్మీ అధికారి ఒకరు తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ, హద్దులు దాటి ప్రవర్తించారు. మహిళా జర్నలిస్ట్ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. పలువురు మీడియా సభ్యుల ముందే సదరు మహిళా జర్నలిస్ట్‌ను చూసి కన్ను గీటారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా, సదరు పాక్ ఆర్మీ అధికారి తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.


పాకిస్తాన్ ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి నిర్వహించిన మీడియా సమావేశంలో ఒక మహిళా జర్నలిస్ట్.. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత ఆయన ఆమెను చూసి కన్నుగీటడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.


ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో సదరు మహిళా జర్నలిస్ట్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ మీద వస్తున్న ఆరోపణల గురించి.. అంటే ఆయన పాకిస్తాన్ దేశ భద్రతకు ముప్పు, దేశ వ్యతిరేకి, ఢిల్లీ చేతుల్లో ఉన్నారంటూ వస్తున్న ఆరోపణల గురించి అహ్మద్ షరీఫ్‌ను ప్రశ్నించారు. అలానే ఇది గతంలో జరిగిన దానికంటే ఎలా భిన్నంగా ఉంది.. లేదంటే భవిష్యత్తులో ఏదైనా మార్పును మనం ఆశించవచ్చా అని ప్రశ్నించారు.


షరీఫ్ దీనిపై స్పందిస్తూ.. మీ ప్రశ్నలకు మరో పాయింట్‌ను కూడా చేర్చాలి. ఇమ్రాన్ ఖాన్ ఒక 'జెహ్ని మరీజ్' (మానసిక రోగి) కూడా అని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత ఆయన సదరు జర్నలిస్ట్ వైపు చూసి నవ్వి, కన్నుగీటారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.


ఎక్స్ (X) యూజర్లు ఈ వీడియో మీద స్పందిస్తూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. "ఇది కెమెరా ముందు బహిరంగంగా జరుగుతోంది. పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం అంతమైంది. ప్రధాని ఒక తోలుబొమ్మ.. ఒక దేశానికి మీమ్.." అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇక షరీఫ్ ఇమ్రాన్ ఖాన్ గురించి స్పందిస్తూ.. ఆయనను ఒక నార్సిసిస్ట్ (స్వప్రేమపరుడు) అని వర్ణించారు. ఇమ్రాన్ రాజకీయ ఆశయాలు ఎంత తీవ్రంగా మారాయంటే.. తాను అధికారంలో లేకపోతే, ఇంకేదీ ఉండకూడదు అని నమ్ముతున్నారని చెప్పుకొచ్చారు. అలానే ఖైదులో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను కలుస్తున్న వ్యక్తులు సైన్యంపై విషం చిమ్మడానికి ప్రయత్నిస్తున్నారని షరీఫ్ ఆరోపించారు.


సైన్యం పట్ల శత్రుత్వాన్ని రెచ్చగొట్టడానికి ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నిస్తున్నారని షరీఫ్ ఆరోపించారు. పాకిస్తాన్ సైన్యం, అలానే.. తమ దేశ ప్రజల మధ్య విభేదాలు సృష్టించడానికి తాము ఎవరినీ అనుమతించము అని చెప్పకొచ్చారు. రాజ్యాంగ హక్కులకు పరిమితులు ఉంటాయని, ముఖ్యంగా దేశ భద్రతకు ముప్పు కలిగించే విషయాలలో అని ఆయన పేర్కొన్నారు. మే 9, 2023న జరిగిన సైనిక స్థావరాలపై దాడులకు ఇమ్రాన్ ఖాన్ కారణమని సైన్యం చేస్తున్న ఆరోపణలను ఆయన మరోసారి గుర్తు చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa