భారతదేశ సంస్కృతికి ప్రపంచ వేదికపై అరుదైన గౌరవం దక్కింది. భారతీయుల అతిపెద్ద పండుగ అయిన దీపావళికి యునెస్కో గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా యునెస్కో జాబితాలోని ఇన్టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చేర్చారు. ఈ అరుదైన ఘనత సాధించిన భారతదేశం నుంచి దీపావళి 16వ సంప్రదాయంగా నిలిచింది. అంతకుముందు యోగా, దుర్గా పూజ వంటి సంప్రదాయాలు ఈ జాబితాలో ఉన్నాయి.
"ఇది భారతదేశానికి చారిత్రక దినం. దీపావళి అధికారికంగా యునెస్కో అమూర్త సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చబడింది" అని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ జీ హయాంలో.. భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి అపూర్వమైన ప్రపంచ గుర్తింపు లభిస్తోందని చెప్పారు. ఈ మైలురాయి ఆ ప్రయాణాన్ని మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. ఈ గౌరవం దీపాల పండుగ ఇచ్చే విశ్వ సందేశాన్ని (నిరాశపై ఆశ, విభజనపై సామరస్యం, అందరికీ వెలుగును) చాటిచెబుతుందని మంత్రి వెల్లడించారు.
ఎర్రకోట వేదికగా నిర్ణయం
యునెస్కో అమూర్త సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించే అంతర్-ప్రభుత్వ కమిటీ 20వ సమావేశం ప్రస్తుతం న్యూఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట వద్ద జరుగుతోంది. డిసెంబర్ 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరుగనున్న ఈ ప్రతిష్టాత్మక సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడం భారత్కు ఇదే మొదటిసారి. అయితే ఈ కమిటీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక ఆచారాలు, సంప్రదాయాలను అంతర్జాతీయ గుర్తింపు, రక్షణ కోసం మూల్యాంకనం చేస్తుంది. దాదాపు వారం రోజుల పాటు కొనసాగనున్నఈ సమావేశాల్లో.. 79 దేశాలు సమర్పించిన 67 నామినేషన్లను కమిటీ పరిశీలిస్తోంది. అందులో భారతదేశం తరపున దీపావళి కూడా ఉంది.
ఈ జాబితాలో దీపావళి చేరికతో పాటు జార్జియా దేశానికి చెందిన "జార్జియన్ గోధుమ సంస్కృతి: సంప్రదాయాలు, ఆచారాలు"కు కూడా యునెస్కో గుర్తింపు లభించింది. పండుగలు, ఆచారాల నుంచి వ్యవసాయ, హస్తకళా సంప్రదాయాల వరకు ఈ ఏడాది సమర్పించిన నామినేషన్ల వైవిధ్యం, సాంస్కృతిక సంప్రదాయాల పరిరక్షణపై పెరుగుతున్న అంతర్జాతీయ ఆసక్తిని తెలియజేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa