ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్ళైన మూడు రోజులకే విడాకులు తీసుకున్న వధువు

national |  Suryaa Desk  | Published : Thu, Dec 11, 2025, 02:18 PM

పెళ్లై అత్తారింట్లో అడుగుపెట్టిన మూడు రోజులకే ఓ నవవధువు విడాకులు కోరిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో వెలుగుచూసింది. వైవాహిక జీవితానికి తన భర్త శారీరకంగా అసమర్థుడని శోభనం రాత్రే తెలియడంతో ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటనపై వధువు కుటుంబం పోలీసులను ఆశ్రయించింది.గోరఖ్‌పూర్‌ పారిశ్రామిక అభివృద్ధి ప్రాధికార సంస్థ (గిడా)లో ఇంజనీర్‌గా పనిచేస్తున్న 25 ఏళ్ల యువకుడితో బేలియాపర్‌కు చెందిన యువతికి నవంబర్ 28న బంధువుల ద్వారా వివాహం జరిగింది. మరుసటి రోజు అప్పగింతల కార్యక్రమం పూర్తిచేశారు. అయితే, శోభనం రోజు రాత్రి తన భర్త శారీరకంగా బలహీనుడనని, దాంపత్య సుఖం ఇవ్వలేనని స్వయంగా చెప్పడంతో వధువు దిగ్భ్రాంతికి గురైంది. "శారీరకంగా అసమర్థుడైన వ్యక్తితో నా జీవితాన్ని పంచుకోలేను" అని ఆమె తన లీగల్ నోటీసులో పేర్కొంది.డిసెంబర్ 1న ఓ సంప్రదాయం ప్రకారం కూతురిని చూడటానికి వచ్చిన తండ్రికి ఆమె ఈ విషయం చెప్పడంతో, ఆయన వెంటనే ఆమెను పుట్టింటికి తీసుకెళ్లారు. అనంతరం ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరిగాయి. వరుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా, అతను తండ్రి కాలేడని తేలినట్లు వధువు కుటుంబ సభ్యులు తెలిపారు. రెండేళ్ల క్రితం కూడా అతనికి ఇదే కారణంతో పెళ్లైన నెలకే విడాకులు అయ్యాయని వారు ఆరోపించారు.విషయం పోలీసుల వద్దకు చేరడంతో, వారి జోక్యంతో ఇరువర్గాల మధ్య రాజీ కుదిరింది. పెళ్లి ఖర్చుల కింద రూ.7 లక్షలతో పాటు, ఇచ్చిన కానుకలన్నీ నెల రోజుల్లోగా తిరిగి ఇచ్చేందుకు వరుడి కుటుంబం అంగీకరించింది. ఈ మేరకు బంధువుల సమక్షంలో ఒప్పందం కుదిరిందని, సమస్య సామరస్యంగా పరిష్కారమవుతోందని సహజన్వా ఎస్‌హెచ్‌‌వో మహేశ్ చౌబే తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa