ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుపై కీలక అప్‌డేట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 12, 2025, 07:22 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం ఐదు జిల్లాల పరిధిలో చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే అన్ని జిల్లాల నుంచి 3ఏ ప్రతిపాదనలు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ వద్దకు చేరాయి. దీంతో అన్ని జిల్లాలకు సంబంధించిన 3ఏ నోటిఫికేషన్ వివరాలను జాతీయ రహదారుల సంస్థ అధికారులు పోర్టల్‌లో నమోదు చేశారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును గుంటూరు. కృష్ణా, ఏలూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో నిర్మించనున్నారు.


ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు సంబంధించిన 3ఏ వివరాలు ఇప్పటికే ఢిల్లీకి చేరాయి. ఎన్టీఆర్ జిల్లా వివరాలు మినహా మిగతా నాలుగు జిల్లాల 3ఏ వివరాలకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, రోడ్లు,ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదించాయి. ఈ జిల్లాల వరకూ గెజిట్ నోటిఫికేషన్ కూడా ప్రచురించారు. ఎన్టీఆర్ జిల్లా వివరాలకు కూడా ఆమోదం లభిస్తే.. అభ్యంతరాలు తెలుసుకునేందుకు పత్రికా ప్రకటన జారీ చేస్తారు. సాధారణ ప్రజలు, ఆయా సర్వే నంబర్లలో ఉన్నవారి నుంచి ఏవైనా అభ్యంతరాలు వ్యక్తమయితే.. జేసీ విచారణ జరుపుతారు. అభ్యంతరాలు లేకపోతే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణ ప్రక్రియ చేపట్టే అవకాశాలు ఉన్నాయి.


 మరోవైపు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును 190 కిలోమీటర్ల మేర ఆరు వరుసలుగా నిర్మించనున్నారు, ప్రాజెక్ట్‌ వ్యయం రూ.24,791 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. ఐదు జిల్లాల పరిధిలోని 23 మండలాలలో ఉన్న 121 గ్రామాల మీదుగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వెళుతోంది. అలాగే కోల్‌కతా- చెన్నై నేషనల్ హైవే నుంచి ఓఆర్‌ఆర్‌కి దక్షిణం, తూర్పు దిశల మధ్యలో రెండు లింక్ రోడ్లు నిర్మిస్తారు.


చెన్నై- కోల్‌కతా నేషనల్ హైవేలో.. విజయవాడ బైపాస్‌ మొదలయ్యే కాజ వద్ద నుంచి తెనాలి వద్ద ఉన్న.. నందివెలుగు వరకు 17 కిలోమీటర్ల మేర అనుసంధాన రహదారిని నిర్మించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఇప్పటికే సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక సిద్ధం చేశారు. మొత్తం 12 ప్యాకేజీలుగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa