డెన్మార్క్కు చెందిన ఒక వ్యక్తి వీర్యాన్ని ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా కనీసం 197 మంది పిల్లలు జన్మించినట్లు.. అయితే ఆ దాతకు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అరుదైన జన్యువు ఉన్నట్లు ఆలస్యంగా వెల్లడైంది. ఈ సంచలన విషయాన్ని డెన్మార్క్ ప్రభుత్వ ప్రసార సంస్థ డీఆర్ బుధవారం బయటపెట్టింది. మొత్తం 14 దేశాల్లోని పదుల సంఖ్యలో క్లినిక్లకు ఆ వ్యక్తి వీర్యాన్ని విక్రయించారు. అయితే ఈ వీర్యం నుంచి పుట్టిన ఓ బిడ్డకు క్యాన్సర్ వచ్చినట్లు గుర్తించడంతో.. అనుమానాలు వెల్లడయ్యాయి. ఆ తర్వాత మరో బిడ్డలో కూడా క్యాన్సర్ వెలుగుచూడటంతో.. ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. దీంతో ఆ వీర్యాన్ని పరీక్షించడంతో దాతలో క్యాన్సర్ కారక జన్యువు ఉన్నట్లు గుర్తించారు.
డెన్మార్క్కు చెందిన వీర్యదాత కైల్డ్ అనే మారు పేరు కలిగిన వ్యక్తి.. 2006 నుంచి 2022 వరకు.. వీర్యాన్ని దానం చేశారు. అతడి వీర్యాన్ని యూరోపియన్ స్పెర్మ్ బ్యాంక్ సేకరించి.. దాన్ని 14 దేశాల్లో ఉన్న 67 క్లినిక్లకు అమ్మేసింది. ఒక్క డెన్మార్క్ దేశంలోనే ఈ కైల్డ్ వీర్య దాత ద్వారా 99 మంది పిల్లలు పుట్టినట్లు డీఆర్ సంస్థ వెల్లడించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కైల్డ్ వీర్యంతో మొత్తంగా 197 మంది పిల్లలు జన్మించినట్లు పేర్కొంది.
అయితే 2020 ఏప్రిల్లో.. కైల్డ్ వీర్యం ద్వారా పుట్టిన ఒక బిడ్డకు క్యాన్సర్ వచ్చినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే వీర్యదాతలో జన్యువు మార్పుపై అనుమానాలు మొదలయ్యాయి. యూరోపియన్ స్పెర్మ్ బ్యాంక్ మొదట ఆ వీర్యాన్ని పరీక్షించినప్పటికీ.. అందులో అరుదైన టీపీ53 జన్యువు మార్పును గుర్తించలేకపోయింది. కానీ 3 ఏళ్ల తర్వాత.. 2023లో మరో బిడ్డలో కూడా క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందినట్లు తెలియడంతో.. మళ్లీ యూరోపియన్ స్పెర్మ్ బ్యాంక్ రంగంలోకి దిగింది. ఆ వీర్యంలోని అనేక నమూనాలను పరీక్షించి.. ఆ వీర్యదాతలో ఆ జన్యువు ఉన్నట్లు చివరికి నిర్ధారించింది. అయితే వీర్యదాత ఆరోగ్యంగా ఉన్నప్పటికీ.. అతని వీర్యాన్ని సేకరించడాన్ని 2023లో నిలిపివేశారు.
ఆ వీర్య దాతలో టీపీ53 అనే అరుదైన జన్యువు మార్పు ఉందని.. ఇది క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు పేర్కొన్నారు. అయితే ప్రపంచంలోనే అతిపెద్దదైన యూరోపియన్ స్పెర్మ్ బ్యాంక్కు ఈ విషయం చాలా ఆలస్యంగా తెలిసింది. ఈ నిర్దిష్ట జన్యువు మార్పు చాలా అరుదైనదని పేర్కొంది. ఇది దాత శుక్రకణాల్లో కేవలం చిన్న భాగంలో మాత్రమే కనిపిస్తుందని.. శరీరంలోని మిగిలిన భాగాల్లో లేదని.. స్పెర్మ్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఆ దాత నుంచి వీర్యం సేకరించి విక్రయించడాన్ని ప్రస్తుతం పూర్తిగా నిలిపివేసినప్పటికీ.. అప్పటికే అతని వీర్యం ద్వారా జన్మించిన దాదాపు 200 మంది పిల్లలు ఇప్పుడు క్యాన్సర్ ప్రమాదంలో ఉన్నారనే ఆందోళనలు తీవ్రం అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa