ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏదో తప్పు జరుగుతోంది.. మద్రాసు హైకోర్టు‌పై సుప్రీంకోర్టు సీరియస్

national |  Suryaa Desk  | Published : Fri, Dec 12, 2025, 08:17 PM

కేసుల విచారణ విధానం, లిస్టింగ్‌‌లో అనుసరించే నిబంధనలపై మద్రాసు హైకోర్టును సర్వోన్నత న్యాయస్థానం వివరణ కోరింది. అంతేకాదు, ఏదో తప్పు జరుగుతోందని వ్యాఖ్యానించింది. కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌ల ధర్మాసనం పై విధంగా స్పందించింది. మద్రాసు హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన నివేదికను పరిశీలించిన అనంతరం ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. టీవీకే కేసులో రిజిస్ట్రార్‌కు నోటీసులు జారీచేసి ఆయన్ను ఓ పార్టీగా చేర్చిన సుప్రీంకోర్టు .. హైకోర్టులో అనుసరిస్తున్న నియమాలను పరిశీలిస్తామని తెలిపింది. ‘హైకోర్టులో ఏదో తప్పిదం జరుగుతోంది.. వాటిని మేము పరిశీలించాల్సి అవసరం ఉంది’ అని జస్టిస్ జీకే మహేశ్వరి అన్నారు.


కరూర్ తొక్కిసలాట ఘటనపై సిట్ దర్యాప్తునకు మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ టీవీకే పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. చెన్నై ధర్మాసనం వ్యవహరించిన తీరు అనుచితంగా ఉందని అభిప్రాయపడింది. రోడ్‌షోల నిర్వహణకు మార్గదర్శకాలు ఇవ్వాలని మాత్రమే పిటిషన్‌లో కోరగా.. సిట్ దర్యాప్తు ఆదేశించడం పట్ల సుప్రీం కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. అంతేకాదు, అంతకు ముందు మదురై ధర్మాసనం తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని నిరాకరించడం కూడా వివాదానికి దారితీసింది.


కరూర్ తొక్కిసలాట ఘటనపై మద్రాసు హైకోర్టు రెండు విరుద్దమైన ఉత్తర్వులను వెలువరించడం పట్ల గతంలోనే ప్రశ్నించిన సుప్రీంకోర్టు.. ఇలా ఎందుకు జరిగిందో పూర్తిస్థాయి నివేదికను అందజేయాలని ఆదేశించింది. సీబీఐ విచారణకు మదురై ధర్మాసనం నిరాకరించగా.. చెన్నై ధర్మాసనం సిట్‌ విచారణకు ఆదేశించింది. కాగా, తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తమిళనాడు డీఎంకే ప్రభుత్వం సవాల్ చేసింది. సెప్టెంబరు 27న టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుని 41 మంది ప్రాణాలు కోల్పోగా.. 60 మంది గాయపడ్డారు.


తమిళనాడు ప్రభుత్వ తరఫున హాజరైన సీనియర్ లాయర్ ఎన్.కే. కౌల్.. ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిందని, దానిపై విచారణ అవసరమని తెలిపారు. కానీ, జస్టిస్ జేకే మహేశ్వరి ధర్మాసనం.. మద్రాస్ హైకోర్టులో కేసులు విచారణ, లిస్టింగ్‌లో అనుసరిస్తున్న విధానాలపై నోటీసు జారీ చేస్తున్నామని, హైకోర్టు రిజిస్ట్రార్‌ను కూడా ఓ పార్టీ చేర్చుతున్నామని పేర్కొంది.


కరూర్ తొక్కిసలాట ఘటనపై విచారణకు హైకోర్టు రిటైర్డ్ జడ్జి అరోణా జగదీశన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఏకసభ్య కమిషన్‌పై సుప్రీం కోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని తమిళనాడు ప్రభుత్వం కోరింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి ఆ కమిషన్ కొనసాగడం అవసరమని ప్రభుత్వం వాదించింది. అయితే దీనిని తర్వాత విచారిస్తామని, ముందుగా ఆ కమిషన్ ఏం చేయబోతోందో తెలుసుకోవాల్సి ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa