ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 12, 2025, 07:28 PM

పర్యాటక కేంద్రంగా పేరుగాంచిన విశాఖపట్నం, ఇప్పుడు టెక్నాలజీ హబ్‌గా రూపుదిద్దుకుంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో బలమైన ఐటీ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తున్నామని, అందులో భాగంగానే ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థలు విశాఖకు తరలివస్తున్నాయని ఆయన తెలిపారు. శుక్రవారం నాడు విశాఖపట్నంలోని కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సమక్షంలో కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ కీలక ప్రకటన చేశారు. తమ సంస్థ ద్వారా విశాఖలో 25 వేల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.కాగ్నిజెంట్ సంస్థ మొత్తం రూ.1,583 కోట్ల పెట్టుబడితో ఈ అత్యాధునిక క్యాంపస్‌ను నిర్మించనుంది. 2033 నాటికి మూడు దశల్లో నిర్మాణం పూర్తి కానుండగా, మొదటి దశను 2026 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నారు. అప్పటివరకు తాత్కాలిక కార్యాలయంలో కార్యకలాపాలు కొనసాగుతాయి. ఈ క్యాంపస్‌లో ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్మెషీన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ వంటి భవిష్యత్ సాంకేతికతలపై దృష్టి సారించనున్నారు.ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ, "మూడు దశాబ్దాల క్రితం హైదరాబాద్‌లో ఐటీకి పునాదులు వేశాం. ఆ విజన్ కారణంగానే నేడు ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీలో కూడా ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ దిశగానే విశాఖను నాలెడ్జ్ ఎకానమీ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం" అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కాగ్నిజెంట్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఆ సంస్థలో 85 శాతం మంది ఉద్యోగులు భారతీయులే కావడం గర్వకారణమని కొనియాడారు. భవిష్యత్తులో ఈ క్యాంపస్‌లో లక్ష మంది ఉద్యోగులు పనిచేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం కాగ్నిజెంట్ తొలుత 8 వేల ఉద్యోగాలు కల్పించాల్సి ఉంది. అయితే శంకుస్థాపన కార్యక్రమానికి ముందు సీఈఓ రవికుమార్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన చంద్రబాబు, విశాఖ యువత కోసం ఉద్యోగాల సంఖ్యను 25 వేలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కోరికను మన్నించిన రవికుమార్, 25 వేల ఉద్యోగాలు ఇస్తామని ఇవాళ వేదికపైనే ప్రకటించారు. విశాఖకు రావడం తన సొంతింటికి వచ్చినట్టుగా ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.విశాఖ నగరం అత్యుత్తమ కనెక్టివిటీ, నివాసయోగ్యమైన వాతావరణం కలిగి ఉందని సీఎం తెలిపారు. "భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు వంటి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా విశాఖను తీర్చిదిద్దుతాం. దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షితమైన నగరం కూడా ఇదే. 2032 నాటికి విశాఖ ఎకనామిక్ రీజియన్‌ను 135 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం," అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఐటీ కంపెనీలకు ఎకరా భూమిని 99 పైసలకే కేటాయించడం ఒక గేమ్ ఛేంజర్ అని అభివర్ణించారు.కాగ్నిజెంట్‌తో పాటు టెక్ తమ్మిన, సత్వ డెవలపర్స్, ఇమాజిన్నోవేట్, ఫ్లూయెంట్ గ్రిడ్, మదర్సన్ టెక్నాలజీస్, క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ తదితర కార్యాలయాలకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సంస్థల ద్వారా రాష్ట్రానికి అదనంగా రూ.3,740 కోట్ల పెట్టుబడులు, 41,700 ఉద్యోగాలు లభించనున్నాయి. ఇప్పటికే నగరంలో 150కి పైగా టెక్ కంపెనీలు పనిచేస్తున్నాయని, గూగుల్ కూడా త్వరలో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa