ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోస్టాఫీస్ స్కీమ్.. .. రూ. 2 లక్షలపై ఎంతొస్తుందో

business |  Suryaa Desk  | Published : Sat, Dec 13, 2025, 10:49 PM

పెట్టుబడులపై రిస్క్ లేకుండా స్థిరమైన రిటర్న్స్ అందుకోవాలని చాలా మంది కోరుకుంటారని చెప్పొచ్చు. ఇందుకోసం ఎక్కువగా సంప్రదాయ పెట్టుబడి పథకాలైన బ్యాంక్ డిపాజిట్లను ఎంచుకుంటుంటారు. ఇక్కడ నిర్దిష్ట వడ్డీ రేట్లను బట్టి.. నిర్దిష్ట కాలానికి.. స్థిరమైన రాబడి వస్తుంది. అయితే ఆర్బీఐ క్రమంగా రెపో రేట్లను తగ్గిస్తుండగా.. ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు క్రమంగా తగ్గుతున్నాయి. చాలా బ్యాంకుల్లో ప్రస్తుతం చారిత్రక కనిష్టాలకు పడిపోయాయి. దిగ్గజ ఎస్బీఐ కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎంపిక చేసిన టెన్యూర్లపై ఇప్పుడు వడ్డీ రేట్లను తగ్గించింది. ఈ క్రమంలో గరిష్ట వడ్డీ రేటు సీనియర్ సిటిజెన్లకు కూడా 7 శాతం కంటే దిగువకు చేరాయి. ఇతర చాలా బ్యాంకుల్లో కూడా ఇదే స్థాయిలో ఉన్నాయని చెప్పొచ్చు.


అయితే బ్యాంక్ డిపాజిట్లకు మించి వడ్డీ ఇచ్చే పోస్టాఫీస్ పథకాలు చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా రిస్క్ ఉండదు. చిన్న మొత్తాల్లోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో వీటిల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేందుకు జనం ఆసక్తి చూపిస్తుంటారు. మనం ఇప్పుడు పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. దీనినే పోస్టాఫీస్ ఎఫ్‌డీ అని చెప్పొచ్చు.


ఇక్కడ టైమ్ డిపాజిట్ ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల టెన్యూర్‌తో వస్తుంది. వడ్డీ రేట్లు వరుసగా 6.90 శాతం, 7 శాతం, 7.10 శాతం, 7.50 శాతంగా ఉన్నాయి. అంటే ఐదేళ్ల టెన్యూర్ డిపాజిట్‌పై గరిష్టంగా 7.50 శాతం వడ్డీ రేటు ఉంది. ఈ పథకంలో కనీసం రూ. 1000 నుంచి పెట్టుబడి ప్రారంభించొచ్చు. గరిష్టంగా ఎలాంటి పరిమితి లేదు. భారతీయ నివాసితులు ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక్కరు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. లేదా జాయింట్‌గా గరిష్టంగా ముగ్గురు కలిసి అకౌంట్ ఓపెన్ చేసేందుకు వీలుంటుంది. జీవిత భాగస్వామితో కలిసి (భార్య/లేదా భర్తతో కలిసి) అకౌంట్ చేయడం బెనిఫిట్ అందిస్తుంది. చాలా మంది ఇలాగే చేస్తుంటారు. మైనర్ పేరిట గార్డియెన్ అకౌంట్ తెరవొచ్చు.


>> ఇక్కడ పెట్టుబడులపై వడ్డీ త్రైమాసికం వారీగా కాంపౌండింగ్ అవుతుంది. వార్షిక ప్రాతిపదికన యాడ్ అవుతుంది. మెచ్యూరిటీకి డబ్బు మొత్తం ఒకేసారి చేతికొస్తుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే నిర్దిష్ట సమయం తర్వాత ముందస్తుగా అకౌంట్ క్లోజ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా అవసరమైతే అకౌంట్ టెన్యూర్ మరోసారి పొడిగించుకోవచ్చు. ఇప్పుడు భార్యతో కలిసి ఒక వ్యక్తి రూ. 2 లక్షలు ఒకేసారి డిపాజిట్ చేస్తే.. మెచ్యూరిటీకి అంటే ఐదేళ్లకు రూ. 89,659 వడ్డీ వస్తుంది. మొత్తం చేతికి రూ. 2,89,659 అందుతుందన్నమాట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa