ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పబ్లిక్ ఇష్యూకు 'ఆర్ఎస్ బ్రదర్స్'.. రూ.500 కోట్లు లక్ష్యం.. సెబీ గ్రీన్ సిగ్నల్

business |  Suryaa Desk  | Published : Tue, Dec 16, 2025, 11:10 PM

 ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌ (ఐపీఓ) ద్వారా నిధులు సమీకరించేందుకు మల్టీ-ఫార్మాట్ అపారెల్ రిటైల్ దిగ్గజం ఆర్ఎస్‌ బ్రదర్స్ రిటైల్ ఇండియా లిమిటెడ్‌కి సిద్ధమైంది. ఈ ఐపీఓకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు సెబీ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసిన వివరాల్లో ఈ విషయం వెల్లడించారు. హైదరాబాద్ కేంద్రంగా రిటైల్ షాపింగ్ మాల్స్ నిర్వహిస్తోన్న ఆర్‌ఎస్ బ్రదర్స్ తెలుగు ప్రజలతో పాటు దక్షణాధి రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే. ఈ సంస్థ వివిధ పేర్లతో షాపింగ్ మాల్స్ నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఐపీఓకు వస్తుండడంతో ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పవచ్చు. మరి ఈ ఐపీఓ వివరాలు తెలుసుకుందాం.


ఆర్‌ఎస్‌ బ్రదర్స్ రిటైల్ ఇండియా సంస్థ హైదరాబాద్‌ కేంద్రంగా ప్రీమియం, మిడ్-ప్రీమియం, వేల్యూ కస్టమర్ సెగ్మెంట్లకు సంప్రదాయ దుస్తులు, క్యాజువల్ దుస్తులు, ఫార్మల్ దుస్తుల విక్రయ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ముసాయిదా ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) ప్రకారం ప్రతిపాదిత ఐపీఓలో భాగంగా రూ. 500 కోట్ల విలువ చేసే ఫ్రెష్ షేర్లను జారీ చేస్తోంది. అలాగే 2.98 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద జారీ చేస్తున్నారు. ప్రమోటర్లు ఆఫర్ సేల్ ద్వారా తమ వాటా విక్రయించనున్నారు. అంటే ఓఎఫ్ఎస్ ద్వారా సేకరించే నిధులు సంస్థకు వెళ్లవని చెప్పవచ్చు. సెబీ నిబంధనలకు అనుగుణంగా ప్రజా వాటా ఉండేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


ఫ్రెష్ షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధుల్లో రూ. 275 కోట్లను నిర్దిష్ట రుణాల చెల్లింపునకు ఉపయోగిస్తామని, మిగితా రూ. 118 కోట్లను ఆర్ ఎస్ బ్రదర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫార్మాట్లలో కొత్త స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే మిగతా మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఆర్ఎస్‌బీ రిటైల్ వినియోగించుకోనున్నట్లు వెల్లడించింది.


2025 ఆగస్టులోనే పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు సెబీ వద్ద ముసాయిదా పత్రాలను ఆర్ ఎస్ బ్రదర్స్ సంస్థ దాఖలు చేసింది. డిసెంబర్ 12, 2025న సెబీ నుంచి అబ్జర్వేషన్లు వచ్చాయి. పబ్లిక్ ఇష్యూ విషయంలో ముందుకెళ్లొచ్చనే సూచనగా దీన్ని పరిగణిస్తారు. 2008లో ఇన్‌కార్పొరేట్ అయిన ఆర్ఎస్‌ బ్రదర్స్ రిటైల్ ఇండియాకి 1999లో బీజం పడింది. అప్పట్లో హైదరాబాద్‌లోని కోఠిలో తొలి ఆర్ ఎస్ బ్రదర్స్ స్టోర్ ప్రారంభించారు. 2025 మార్చి 31 నాటికి మూడు దక్షిణాది రాష్ట్రాల్లో (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక) 22 నగరాల్లో ఆర్ఎస్‌ బ్రదర్స్‌ రిటైల్‌కి 73 స్టోర్లు ఉన్నాయి. ప్రధానంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ఆర్ ఎస్ బ్రదర్స్, కాంచీపురం నారాయణి సిల్క్స్, డీ రాయల్, వేల్యూ జోన్ హైపర్ మార్ట్ పేరుతో అయిదు రకాల స్టోర్ ఫార్మాట్లతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది.


2023-2025 ఆర్థిక సంవత్సరాల మధ్య ఆర్ఎస్‌బీ రిటైల్ ఇండియా ఆదాయం వార్షికంగా 12.55 శాతం వృద్ధితో రూ. 2,694 కోట్లుగా నమోదు చేసింది. 2025 ఆర్థిక సంవత్సరంలో పన్ను అనంతర లాభం రూ. 104.4 కోట్లుగా నమోదైంది. ఈ ఐపీఓకు మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa