మంత్రి భర్త, బీజేపీ నేత బిహార్ అమ్మాయిలు గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఉత్తరాఖండ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి రేఖా ఆర్య భర్త గిరిధర్ లాల్ సాహు.. పెళ్లికోసం బీహార్లో అమ్మాయిలు రూ. 20,000-25,000లకే దొరుకుతారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్, బిహార్ రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తన వ్యాఖ్యలపై సాహు క్షమాపణ చెప్పినప్పటికీ.. బీజేపీ మాత్రం వివాదానికి దూరంగా ఉంది. అల్మోరాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సాహు అక్కడ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
‘మీరు వృద్ధాప్యంలో పెళ్లి చేసుకుంటారా? అమ్మాయి దొరక్కుంటే మీ కోసం బీహార్ నుంచి ఒకరి తీసుకువస్తాం.. అక్కడ రూ.20,000 నుంచి రూ. 25,000లు ఇస్తే అమ్మాయిను పొందొచ్చు’ అని ఆయన మాట్లాడటం వీడియోలో ఉంది. ‘నాతో రండి, మీకు పెళ్లి చేస్తాం’ అని కూడా ఆయన కార్యక్రమంలో యువతను ఉద్దేశించి అన్నట్లు తెలుస్తోంది. అయితే, తన మాటలను వక్రీకరించారని, కేవలం ఒక స్నేహితుడి పెళ్లి గురించి మాట్లాడానని వివాదం సాహు ఒక వీడియో విడుదల చేశారు. ‘నా మాటలు ఎవరినైనా బాధించి ఉంటే, చేతులు జోడించి క్షమాపణ కోరుతున్నాను’ అని ఆయన అన్నారు.
అధికార బీజేపీ ఈ వ్యాఖ్యలను ఖండించింది. సాహుకు పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందిస్తూ.. దేశంలో మహిళలందరినీ అవమానించారని మండిపడింది. ‘మంత్రి ఆర్య భర్త చేసిన ఈ వ్యాఖ్యలు బిహార్, కేరళ, లేదా ఉత్తరాఖండ్లోనే కాదు దేశంలోని కుమార్తెలందరికీ అవమానం’ అని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ గోడియల్ అన్నారు. మహిళల పట్ల బీజేపీ గౌరవాన్ని ఇవి స్పష్టంగా తెలియజేస్తున్నాయని ఆయన ఆరోపించారు ‘ఈ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించి, క్షమాపణ చెప్పాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.
తన భార్య మహిళా, శిశు సంక్షేమ మంత్రిగా ఉన్నప్పుడు సాహు వ్యాఖ్యలు సిగ్గుచేటని కాంగ్రెస్ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోతి రౌతేలా దుయ్యబట్టారు. ‘ఇది మహిళలు, బాలికల గౌరవంపై దాడి. ఇలాంటి ఆలోచనలు మానవ అక్రమ రవాణా, బాల్య వివాహాలు, మహిళల దోపిడీ వంటి సామాజిక దురాచారాలను ప్రోత్సహిస్తాయి’ అని ఆమె అన్నారు.
ఉత్తరాఖండ్ బీజేపీ మీడియా ఇంఛార్జ్ మన్వీర్ సింగ్ చౌహాన్.. ‘మహిళలకు వ్యతిరేకంగా చేసే ద్వేషపూరిత ఆలోచనలు, వ్యాఖ్యలను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. మంత్రిని ఆమె భర్త వ్యాఖ్యలపై వివరణ కోరతారా? అని ప్రశ్నించగా.. సాహుతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చౌహాన్ స్పష్టం చేశారు. ఇక, ఈ వ్యాఖ్యలపై బిహార్ రాష్ట్ర మహిళా కమిషన్ (BSWC) సాహుకు నోటీసు జారీ చేయనున్నట్లు తెలిపింది. చైర్పర్సన్ అప్సర విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఆయన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించాల్సినవి.. ఇది ఆయన మానసిక దివాలాకోరుతనాన్ని చూపుతుంది. తన భార్య ఉత్తరాఖండ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు మహిళల గురించి ఆయన ఎలా అలాంటి వ్యాఖ్యలు చేయగలరు?’ అని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa