ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్ భూతల దాడుల వార్నింగ్.. వెనుజులా రాజధానిలో భారీ పేలుళ్లు

international |  Suryaa Desk  | Published : Sat, Jan 03, 2026, 09:32 PM

వెనుజులా రాజధాని కరాకస్‌ నగరం భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. జనవరి 3న శనివారం తెల్లవారుజామున యుద్ధ విమానాలు పైనుంచి వెళ్తున్నట్లు శబ్దాలతో పాటు భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని ఏఎఫ్‌పీ జర్నలిస్ట్ తెలిపారు. కరేబియన్ దేశానికి నేవీ దళాలను పంపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వెనుజులాపై భూతల దాడుల అవకాశం గురించి ప్రస్తావించిన తరుణంలో ఈ పేలుళ్లు చోటుచేసుకోవడం గమనార్హం. స్థానిక కాలమానం ప్రకారం జనవరి 3న తెల్లవారుజామున 2 గంటల నుంచి 2.15 గంటల వరకు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ, అవి ఖచ్చితంగా ఏ ప్రాంతం నుంచి వచ్చాయనేది స్పష్టత లేదు. అయితే, ఏడు ప్రాంతాల్లో చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. పేలుళ్లకు జనం భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు.


వెనుజులా డ్రగ్స్‌ను రవాణా చేస్తోందని, పోర్టులో మత్తు పదార్థాలతో సిద్ధంగా ఉన్న బోట్లను ధ్వంసం చేశామని ట్రంప్ సోమవారం ప్రకటించారు. అయితే, ఇందుకోసం సైనిక చర్యనా లేక సీఐఏ ఆపరేషన్ చేపట్టారా? అనేది చెప్పడానికి ఆయన నిరాకరించారు. కేవలం అది తీరం వెంబడి జరిగిందని మాత్రమే వివరించారు. వెనిజులా గడ్డపై జరిగిన మొట్టమొదటి భూతల దాడి ఇదే. భూతల దాడుల గురించి ట్రంప్ హెచ్చరించిన తర్వాత వెనిజులాలో భారీ పేలుళ్లు సంభవించాయి. డ్రగ్స్ బోట్లపైనే దాడి జరిగినట్టు తెలుస్తోంది.


అమెరికా సైనిక ఒత్తిడి నేపథ్యంలో, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో సోమవారం జరిగిన దాడిపై స్పందించలేదు. అయితే, వాషింగ్టన్‌తో సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని జనవరి 1న గురువారం తెలిపారు. మదురోను డ్రగ్ కార్టెల్ నాయకుడిగా అమెరికా ఆరోపిస్తూ, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకుంటామని చెబుతోంది. కానీ, వెనిజులాలో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్నాయని, అందుకే అమెరికా తన ప్రభుత్వాన్ని కూలదోయాలని చూస్తోందని మదురో ఆరోపిస్తున్నారు.


ఇటీవల, వెనిజులా గగనతలాన్ని మూసివేయడం, మరిన్ని ఆంక్షలు విధించడం, వెనిజులా చమురుతో నిండిన ట్యాంకర్లను స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలతో కారకాస్‌పై ఒత్తిడి పెంచింది. డ్రగ్ కార్టెల్స్‌పై భూతల దాడులు చేస్తామని, అవి ‘త్వరలో’ ప్రారంభమవుతాయని ట్రంప్ వారాల తరబడి బెదిరిస్తున్నారు. సోమవారం జరిగిన సంఘటన దీనికి మొదటి ఉదాహరణగా కనిపిస్తోంది. దీంతో పాటు అమెరికా దళాలు కరేబియన్, తూర్పు పసిఫిక్ సముద్రంలో సెప్టెంబరు నుంచి అనేక దాడులు నిర్వహించారు. డ్రగ్ స్మగ్లర్లనే తాము టార్గెట్ చేసినట్టు అమెరికా తన దాడులను సమర్దించుకుంటోంది. కానీ, ఆ పడవల్లో డ్రగ్స్ ఉన్నాయనడానికి ఆధారాలను మాత్రం బయటపెట్టలేదు. అమెరికా సైన్యం వెల్లడించిన సమాచారం ప్రకారం.. యూఎస్ దళాలు చేసిన దాదాపు 30 దాడుల్లో కనీసం 107 మంది హతమైనట్టు తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa