అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్లోబల్ ఆయిల్ మార్కెట్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిణామాల ప్రభావంతో అంతర్జాతీయ ఇంధన రంగంలో భారత్ తన వ్యూహాన్ని వేగంగా పునర్వ్యవస్థీకరిస్తోంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకున్న భారత్, ఇప్పుడు ఆ కొనుగోళ్లను క్రమంగా తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. డొనాల్డ్ ట్రంప్ తిరిగి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంతో ఏర్పడిన కొత్త అంతర్జాతీయ రాజకీయ, వాణిజ్య సమీకరణాలే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.ఇప్పటి వరకు ఎప్పుడూ లేని స్థాయిలో భారత్ అమెరికా నుంచి ముడిచమురు దిగుమతులను పెంచింది. తాజా ఆర్థిక గణాంకాల ప్రకారం ఈ కొనుగోళ్లలో 92 శాతం వృద్ధి నమోదైంది. 2025 ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో అమెరికా నుంచి చమురు దిగుమతులు దాదాపు రెట్టింపు అయ్యాయి. 2024 నవంబర్లో 1.1 మిలియన్ టన్నులుగా ఉన్న దిగుమతులు, 2025 నవంబర్ నాటికి 2.8 మిలియన్ టన్నులకు చేరాయి. అంటే ఏడాది కాలంలోనే 144 శాతం పెరుగుదల చోటుచేసుకుంది. ఫలితంగా భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో అమెరికా వాటా 5.1 శాతం నుంచి 12.6 శాతానికి పెరగడం గమనార్హం.ఇక మరోవైపు, తక్కువ ధరకు చమురు లభిస్తున్నప్పటికీ భారత్ రష్యాపై తన ఆధారాన్ని తగ్గిస్తోంది. దీనికి పలు కీలక కారణాలు ఉన్నాయి. రష్యాకు చెందిన చమురు దిగ్గజ సంస్థలు రోస్నెఫ్ట్, లుకోయిల్పై అమెరికా ఆంక్షలు విధించడంతో, వాటి నుంచి చమురు కొనుగోళ్లు చేయడం బ్యాంకింగ్ లావాదేవీల పరంగా భారత్కు సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అంతేకాక, రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగితే భారత్పై భారీ సుంకాలు విధిస్తామని ట్రంప్ పలుమార్లు హెచ్చరించడంతో, వాణిజ్య ఉద్రిక్తతలను నివారించేందుకు భారత్ అమెరికా వైపు మొగ్గు చూపుతోంది. దీనికి నిదర్శనంగా 2025 అక్టోబర్లో రష్యా నుంచి చమురు దిగుమతుల విలువ 38 శాతం తగ్గింది. ఇది ఇటీవలి కాలంలో నమోదైన అతిపెద్ద పతనంగా విశ్లేషకులు చెబుతున్నారు.ఒకే దేశంపై ఆధారపడకుండా ఇంధన భద్రతను కాపాడుకోవాలనే లక్ష్యంతో భారత్ తన ఇంధన వనరులను విస్తరిస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో అమెరికా నుంచి ముడిచమురు దిగుమతులను మరో 150 శాతం పెంచేందుకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. చమురుతో పాటు ఎల్పీజీ, ఎల్ఎన్జీ రంగాల్లో కూడా అమెరికా భారత్కు కీలక భాగస్వామిగా మారుతోంది.రష్యా నుంచి చౌకగా లభించే చమురును తగ్గించడం వల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై కొంత ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ, అమెరికాతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడం, అంతర్జాతీయ ఆంక్షల ప్రమాదాన్ని తగ్గించుకోవడం భారత్కు దీర్ఘకాలంలో మరింత లాభదాయకంగా మారనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ హయాంలో ‘అమెరికా ఫస్ట్’ విధానానికి అనుగుణంగా భారత్ తన ఇంధన వ్యూహాన్ని మలుచుకుంటోందనడానికి ఈ మారుతున్న గణాంకాలే స్పష్టమైన నిదర్శనంగా నిలుస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa