ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాంబు పెట్టి పేల్చేస్తామంటూ....పశ్చిమ బెంగాల్ గవర్నర్‌పై హత్యాయత్నం కుట్ర...?

national |  Suryaa Desk  | Published : Fri, Jan 09, 2026, 08:15 PM

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గవర్నర్ సి.వి. ఆనంద బోస్‌ను చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపు ఈమెయిల్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. "నిన్ను బాంబు పెట్టి పేల్చివేస్తాం" అంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈ హెచ్చరికతో గురువారం అర్ధరాత్రి లోక్ భవన్ (రాజ్‌భవన్) వద్ద భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న గవర్నర్‌కు ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా రంగంలోకి దిగింది.


అర్ధరాత్రి భద్రతా సమీక్ష


గవర్నర్ కార్యాలయానికి ఈమెయిల్ అందగానే ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు. అర్ధరాత్రి సమయంలోనే సీనియర్ భద్రతా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ప్రస్తుత భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. బెంగాల్ పోలీసులతో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బలగాలు సమన్వయంతో రాజ్‌భవన్ చుట్టూ పహారాను పెంచాయి. గవర్నర్‌కు ఇలాంటి బెదిరింపులు రావడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఆయనకు హెచ్చరికలు అందాయి. అయితే తాజా ఎన్నికల నేపథ్యంలో ఈ బెదిరింపును అధికారులు అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు.


గవర్నర్‌కు వచ్చిన బెదిరింపులపై బీజేపీ నేత అమిత్ మాలవీయ తీవ్రంగా స్పందించారు. మమతా బెనర్జీ పాలనలో గవర్నర్‌కే రక్షణ లేదని.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయని విమర్శించారు. ఒకవైపు బొగ్గు అక్రమ రవాణా, మనీలాండరింగ్ కేసుల్లో ప్రైవేట్ సంస్థలను కాపాడటానికి మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారని.. అందుకే ఆమె ఈడీ ఫైళ్లను లాక్కోవడానికి చూస్తున్నారని మాలవీయ ఆరోపించారు.


మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో ఈడీ సోదాలు హైడ్రామాకు దారితీశాయి. బొగ్గు కుంభకోణం కేసులో భాగంగా రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐ-ప్యాక్ కార్యాలయంలో ఈడీ సోదాలు నిర్వహిస్తుండగా.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా అక్కడికి వెళ్లడం సంచలనంగా మారింది. తమ పార్టీకి చెందిన హార్డ్ డిస్క్‌లు, అభ్యర్థుల జాబితాలు, తమకు సంబంధించిన వ్యూహాత్మక పత్రాలను కేంద్ర సంస్థలు స్వాధీనం చేసుకున్నాయని ఆమె ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడుతూ, ఈ దాడులకు నిరసనగా జనవరి 9న కోల్‌కతాలో భారీ నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa